జ్యోతిర్లింగ దివ్యక్షేత్రం శ్రీశైలంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో బుధవారం శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి మయూర వాహనంపై ఆలయ వీధుల్లో ఊరేగనున్నారు. బుధవారం రాత్రి ఏడుగంటలకు సర్వాలంకారభూషితుడైన భోళాశంకరుడు మయూర వాహనంపై క్షేత్ర పురవీధుల గుండా విహరించి భక్తులకు అభయ ప్రదానం చేస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా... శ్రీ భ్రమరాంబికా, మల్లన్నస్వామికి ప్రత్యేక కుంకుమార్చనలు, నవవర్ణార్చనలు ఘనంగా జరిగాయి.ఇదిలా ఉండగా... బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం అశేషభక్తజనసందోహంతో పోటెత్తింది. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వేలకొలది భక్తులు, శివస్వాములు శ్రీశైలం కొండకు తరలి వస్తున్నారు. తెలంగాణ, కోస్తా, రాయలసీమ ప్రాంతాల నుంచి కాలినడకన శ్రీశైలం చేరుతున్న భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. బ్రహ్మోత్సవాల రెండో రోజు మాత్రం 50వేల మందికి పైగా భక్తులు శ్రీశైలం చేరుకున్నారని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. |