ప్రేమతో చేసే సేవలు అమూల్యమైనవని త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి పేర్కొన్నారు. ఇతరులకు సేవ చేయడంలో అందరూ ముందంజ వేయాలని, ప్రేమతో చేసే సేవలకు విలువ కట్టలేమని జీయర్ చెప్పారు. మనుషుల్లో పెంపొందే భక్తి భావమే ముక్తిమార్గంగా నిలుస్తుందని ఆయన తెలిపారు. శ్రీకాకుళం జిల్లా మందసలో జరుగుతున్న వాసుదేవ పెరుమాళ్ ఆలయ ప్రతిష్ఠ మహోత్సవాల్లో భాగంగా... ఆయన భక్తులనుద్దేశించి పైవిధంగా మాట్లాడారు. సమాజంలో మంచిని పెంపొందింపజేయాలనే ఉద్దేశంతోనే వాసుదేవాలయ నిర్మాణం జరిగిందని జీయర్ అన్నారు. నీతివంతమైన సమాజం ఏర్పాటుకు భక్తిభావం చాలా అవసరమని జీయర్ సూచించారు. ఇదిలా ఉండగా.. వాసుదేవ ప్రతిష్ఠ మహోత్సవాల్లో భాగంగా బుధవారం ఆలయ ప్రాంగణం భక్తజనసందోహంతో పోటెత్తింది. దేశ, విదేశాల నుంచి భారీ ఎత్తున స్వాములు, భక్తులు ఈ ఉత్సవాలకు తరలి వచ్చారు. ఈ సందర్భంగా వాసుదేవ పెరుమాళ్కు నిత్యం జరిగే పూజలతో పాటు చిన జీయర్ స్వామివారి నేతృత్వంలో తత్త్వన్యాస హోమం, శయ్యాధివాసము వంటి విశిష్ట పూజలు జరిగాయి. |