చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. మంగళవారం ఉదయం ప్రారంభమైన ఈ జాతరలో, అమ్మవారిని వేలాది మంది భక్తులు దర్శించుకుంటున్నారు. నడివీధి గంగమ్మ జాతరతో పాటు సంతపేట, గిరింపేట, కొంగారెడ్డి, దొడ్డిపల్లె పరిసర ప్రాంతాల్లోనూ గంగమ్మ జాతరలను వైభవంగా నిర్వహిస్తున్నారు. మంగళ, బుధవారాల్లో జరిగే ప్రధాన జాతరలో భాగంగా.. అమ్మవారిని పుష్పాలు, పసిడి ఆభరణాలు, పట్టు వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. చిత్తూరు నడిబొడ్డులోని బంకమట్టితో నెలకొల్పిన గంగమ్మను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు.ఇదే విధంగా.. తిరుపతి తాతయ్య గంగమ్మ జాతర సోమవారం వైభవంగా ప్రారంభమైంది. ఈ జాతరలో భాగంగా.. భక్తులు సున్నపు కుండీల వేషాలు ధరించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.చిత్తూరు గంగమ్మ జాతరను పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను పటిష్టం చేశారు. ఇందులో భాగంగా... జాతర జరిగే ప్రధాన ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహరించారు. |