ప్రపంచమంతా ఆర్థికమాంద్యంతో అతలాకుతలమౌతోంది. కాని దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన షిరిడీలోని సాయిబాబా ఆలయంలో మాత్రం ఆర్థిక మాంద్యం ప్రభావం కమపడలేదు. ఈ ఏడాది ఆలయాన్ని దర్శించుకున్న వారి సంఖ్య పెరగడమే కాకుండా భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడంలో కూడా ఎక్కువ మొత్తాన్నే చెల్లించుకున్నారు. నిరుడు జనవరి నెల నుంచి ఏప్రిల్ నెల వరకు 27 లక్షల 66 వేల 604మంది భక్తులు బాబాను దర్శించుకుని బాబా ప్రసాదాలను తీసుకున్నారు. అదే ప్రస్తుత ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ నెల వరకు దాదాపు 34 లక్షల 23 వేల 552మంది భక్తులు బాబాను దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించినట్లు సాయీ ప్రసాదాలయం తెలిపింది. ఈ లెక్కలు కేవలం భక్తులు తమ ప్రసాదాలయంలో భోజనం చేసి స్వామి ప్రసాదాన్ని స్వీకరించినవారు మాత్రమేనని తమ లెక్కలలో తేలినట్లు ప్రసాదాలయం పేర్కొంది.ఇందులో బయటి హోటళ్లలో భోజనం చేసినవారి సంఖ్య మాత్రంలేదు. అది లక్షలలో ఉండగలదని వారు అనుమానం వ్యక్తం చేశారు. కాగా సాయిబాబాకు బంగారం సమర్పణకూడా అధికమొత్తంలోనే వచ్చిందని అధికారిక వర్గాలు తెలిపాయి. హుండీ ఆదాయం : నిరుడు మందిర పరిసరాలలో ఉంచిన హుండీలలో జనవరినెలలో 6.58 కోట్ల రూపాయలు, ఫిబ్రవరి నెలలో 4.52 కోట్ల రూపాయలు, మార్చినెలలో 6.05 కోట్ల రూపాయలు, ఏప్రిల్ నెలలో5.21 కోట్ల రూపాయలను భక్తులు సమర్పించుకున్నారు. అదే ఈ సంవత్సరం జనవరి నెలలో 9.50 కోట్ల రూపాయలు, ఫిబ్రవరి నెలలో 5.55 కోట్ల రూపాయలు, మార్చి నెలలో 7.04 కోట్ల రూపాయలు,ఏప్రిల్ నెలలో 6.05 కోట్ల రూపాయలను భక్తులు సమర్పించుకున్నారు. కనక సమర్పణ : షిర్డీ సాయిబాబాకు స్వర్ణాభరణాలు సమర్పించుకోవడంలోకూడా పెరుగుదల కనపడింది. నిరుడు జనవరి నెలలో 1.095 కిలో గ్రాములు, ఫిబ్రవరి నెలలో 1.076కిలో గ్రాములు, మార్చినెలలో 1.35కిలో గ్రాములు, ఏప్రిల్ నెలలో 1.178కిలో గ్రాముల బంగారును బాబాకు సమర్పించుకున్నారు. కాగా ప్రసుత ఏడాది జనవరి నెలలో 1.745, ఫిబ్రవరి నెలలో 1.064, మార్చ్ నెలలో 1.922, ఏప్రిల్ నెలలో 1.286కిలో గ్రాముల బంగారాన్ని బాబాకు సమర్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. |