తిరుపతిలో వెలసిన శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 30వ తేదీ నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. శనివారం (30వ తేదీ) ఉదయం మిధున లగ్నంలో నిర్వహించే ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు లాంఛనంగా ప్రారంభమౌతాయి. ఈ నెల 30 నుంచి జూన్ 7వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా.. 30వ తేదీ సాయంత్రం 8 గంటలకు పెద్ద శేష వాహనంలో స్వామివారు తిరుమాడవీధుల్లో ఊరేగుతారు. 31వ తేదీ ఉదయం చిన్న శేషవాహనం, రాత్రి 8 గంటలకు హంసవాహన సేవలు ఘనంగా జరుగనున్నాయి.ఇకపోతే.. జూన్ ఒకటోతేదీ ఉదయం సింహవాహనం, రాత్రి ముత్యపు పందిరి, 2వ తేదీ కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, 3వ తేదీ ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి గరుడ సేవను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా.. జూన్ నాలుగో తేదీ ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు వసంతోత్సవం, రాత్రి 8 గంటలకు గజవాహన సేవ జరుగుతుంది. ఐదో తేదీ సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవలు, ఆరోతేదీ ఉదయం రథోత్సవం, రాత్రి 8 గంటలకు అశ్వవాహనం, చివరి రోజైన ఏడో తేదీ ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి 8 బంగారు తిరుచ్చి వాహనం, రాత్రి 9.10 గంటలకు ధ్వజారోహణం కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ అధికారులు ఆ ప్రకటనలో తెలిపారు. |