శ్రీవారిపై స్వరార్చనకు తితిదే రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. వెంకన్నపై స్వరార్చన చేయడానికి ముందుకు వచ్చిన భారత రత్న లతా మంగేష్కర్కు ప్రోత్సాహం ఇవ్వాలని తితిదే పాలకమండలి నిర్ణయించింది. తిరుమల అన్నమయ్య భవన్లో శనివారం తితిదే ఛైర్మన్ డి.కె. ఆదికేశవులు నాయుడు అధ్యక్షతన పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అనంతరం పాలక మండలి తీసుకున్న నిర్ణయాలను తితిదే ఛైర్మన్ ఆదికేశవులు నాయుడు విలేకరులతో వెల్లడించారు. ఇందులో భాగంగా.. తితిదే., స్విమ్స్ సంయుక్తంగా తిరుపతిలో వైద్యకళాశాల ఏర్పాటు చేయాలని తీర్మానించినట్లు తెలిపారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా తిరుమలలో ప్లాస్టిక్ వినియోగాన్ని ఏడాది లోపు సంపూర్ణంగా నిషేధించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. |