తెలంగాణ ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకునే గోల్కొండ బోనాల ఉత్సవం జంటనగరాల్లో వైభవంగా ప్రారంభమైంది. వచ్చేనెల 23వరకు జరిగే ఈ బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతి గురు, ఆదివారాల్లో జగదాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. గోల్కొండ కోటపై వెలసిన అమ్మలగన్న అమ్మ జగదాంబ అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవం గురువారం ఘనంగా ఆరంభమైంది. ఈ ఉత్సవాల్లో భాగంగా.. ఏడుగురు అక్కచెల్లెల్లలో పెద్దదైన జగదాంబ మాత ఘటోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పోతురాజుల నృత్యాలు, బ్యాండ్ మేళాలు, డప్పుచప్పళ్లు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం రథాలు, ఘటాల వూరేగింపులు ఘనంగా జరిగాయి. లంగర్ హౌస్ నుంచి జూల తీసుకురాగా, చోటీ బజార్ నుంచి అమ్మవారి విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఈ ఘటాల ఊరేగింపులో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. బోనాలను పురస్కరించుకుని పోలీసు శాఖ పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. |