లండన్లో జరిగిన జగన్నాథ రథయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. గత బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు పూరీలో ప్రారంభమైన జగన్నాథ రథ యాత్రకు దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం లండన్లో జగన్నాథ రథయాత్ర కన్నుల పండుగగా జరిగింది.40 అడుగుల ఎత్తైన మూడు రథ చక్రాలు కదిలిన వైనాన్ని వీక్షించిన వేలాది మంది భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. లండన్లోని హైడ్ పార్క్ నుంచి ట్రఫ్లర్గర్ స్క్వార్ వరకు జరిగిన ఈ యాత్రలో గాయకుల భక్తి గానాలు, సాంస్కృతిక నృత్యప్రదర్శన భక్తులను పెద్ద ఎత్తున ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా.. భువనేశ్వర్లోని పూరీలో పన్నెండు రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగే జగన్నాథ రథోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. దీనికోసం 45 అడుగుల ఎత్తుతో 16 చక్రాలతో జగన్నాథుని రథం, 44 అడుగుల ఎత్తుతో 14 చక్రాలతో బలభద్రుని రథం, 43 అడుగుల ఎత్తుతో 12 చక్రాలతో సుభద్ర రథాలను సిద్ధం చేశారు. 12 రోజులపాటు జరిగే ఈ రథయాత్రకు అత్యధిక సంఖ్యలో తరలి వస్తున్న భక్తకోటికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను చేసింది. గతంలో జరిగిన రథయాత్రలో తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో.. ఈ ఏడాది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టినట్లు పోలీసు యంత్రాంగం ఓ ప్రకటనలో తెలిపింది. |