కలియుగ వైకుంఠం శ్రీవారి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా వృద్ధులు, చంటిబిడ్డ తల్లిదండ్రులు, వికలాంగులకు మహద్వార ప్రవేశాన్ని రద్దు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం భావిస్తోంది.
వచ్చేనెల 21 నుంచి 29వ తేదీ వరకు జరుగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ ఎత్తున తరలి వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని తితిదే ఈ నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు దాదాపు మూడు లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది.
శ్రీవారి సేవల్లో గరుడ సేవరోజు ఈ సంఖ్య రెండింతలు పెరిగే అవకాశం ఉందని తితిదే అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో మహాద్వార ప్రవేశాన్ని రద్దు చేస్తే శ్రీవారి దర్శనం కోసం వేచి ఉండే భక్తులందరికీ సౌకర్యంగా ఉంటుందని తితిదే అధికారులు భావిస్తున్నారు.
దీంతో కనీసం బ్రహ్మోత్సవాల సందర్భంగానైనా తాత్కాలికంగా మహద్వారా ప్రవేశాన్ని రద్దు చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవని యోచిస్తోంది. ఈ అంశంపై టీటీడీ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.
ఇదిలా ఉండగా.. తిరమల ప్రత్యేకాధికారి ఏవీ. ధర్మారెడ్డిని మరో రెండేళ్లు అదే పోస్టులో కొనసాగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంతరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఏవీ. ధర్మారెడ్డికి మరో రెండేళ్లు శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో తరించే భాగ్యం లభించింది.