తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరులో ప్రారంభం కానున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అమ్మవారి సన్నిధిలోని బంగారు రథానికి 5లక్షల రూపాయలతో టీటీడీ ఇంజనీరింగ్ విభాగం మరమ్మతులు చేపడుతోంది.
నవంబరులో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల్లో బంగారు రథం నాలుగు మాడవీధుల్లో సాఫీగా తిరిగేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గత ఏడాది బంగారు రథాన్ని సిద్ధం చేసి బ్రహ్మోత్సవాలకు ముందుగా ట్రయల్ రన్ చేశారు. ఆ సమయంలో రథానికి కింది భాగంలో ఉన్న రాడ్ జాయింట్ ఊడిపోయింది. దీంతో ఇంజనీరింగ్ అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసి బ్రహ్మోత్సవాల్లో విజయవంతంగా రథోత్సవం నిర్వహించారు.
ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఉండేందుకుగాను ఈ ఏడాది దాదాపు 5లక్షల రూపాయలతో రథాలకు ఇనుప చక్రాలను, తిరుమలలో ఉపయోగించే విధంగా హైడ్రాలిక్ బ్రేక్లను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో బంగారు రథం సాఫీగా సాగేందుకు అవకాశం ఉంటుందని తితిదే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.