కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి 20 కిలోల స్వర్ణ పీతాంబరాన్ని నెల్లూరు ఎంపీ, మాజీ టీటీడీ బోర్డు సభ్యుడు మేకపాటి రాజమోహన రెడ్డి కానుకగా సమర్పించారు. గురువారం రాత్రి ఆలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో రూ. 37కోట్ల విలువగల ఈ పీతాంబరాన్ని టీటీడీ ఈవో కృష్ణారావుకు అందజేశారు.
శ్రీవారి మూలవిరాట్టు నాభిభాగానికి దిగువన ఈ పీతాంబరాన్ని ధరింపజేస్తారు. గతంలో 20 కిలోల బంగారంతో టీటీడీ సొంతంగా తయారు చేయించిన పీతాంబరాన్ని ఇప్పటిదాకా అలంకరిస్తున్నారు. దీంతో వెంకన్న స్వామికి రాజమోహన రెడ్డి సమర్పించిన స్వర్ణ పీతాంబరం రెండోది కావడం విశేషం.
ఈ స్వర్ణ పీతాంబరాన్ని చెన్నైలో ఐదుగురు నిపుణులు ఐదు నెలలపాటు శ్రమించి తయారు చేశారని ఎంపీ రాజమోహనరెడ్డి చెప్పారు. తన పెద్ద కుమారుని కోరిక మేరకు ఈ కానుకను వెంకన్న స్వామికి సమర్పించినట్లు ఆయన తెలిపారు. ఇంకా దీని బరువు 20.785కేజీలు కాగా, ఎత్తు 3.75 అడుగులు.
24 క్యారెట్ల బంగారంతో తయారైన ఈ పట్టు పీతాంబరాన్ని శుక్రవారం వేకువజామున అభిషేక సేవ అనంతరం స్వామివారికి అలంకరించారు.