నాగులచవితిని పురస్కరించుకుని గురువారం నాడు మలయప్పస్వామి పెద్దశేష వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగారు. ప్రతి ఏటా నాగులచవితి రోజున కోనేటి రాయుడైన శ్రీవారిని పెద్దశేష వాహనంపై ఊరేగించడం ఆనవాయితీ. అలాగే గురువారం వాహన సేవకు ముందు స్వామివారి ఉత్సవర్లకు ప్రత్యేక పూజలు పూర్తి చేశారు.
అనంతరం వాహన మండపాని వేంచేపుగా తీసుకువచ్చి, ఉత్సవర్లను పెద్దశేష వాహనంపై ఆసీనులను చేశారు. గురువారం రాత్రి జరిగిన ఈ వాహన సేవలో వేలాది మంది భక్తులు వెంకన్న స్వామిని దర్శించుకున్నారు.
అగ్రభాగాన బ్రహ్మరథ సారథ్యంలో గో, గజ, అశ్వరాజాలతో ఉభయనాంచారులతో మలయప్పస్వామి ఊరేగిన వైనాన్ని తిలకించిన భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. దీనికి తోడు భక్తుల గోవిందనామస్మరణతో తిరుమల కొండ మారుమ్రోగింది.