ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూ దర్శనమిచ్చే తిరుమలపై వెలసిన ఆపద్భాంధవుడు, కోనేటి రాయుడు, శ్రీ వెంకటేశ్వర స్వామికి కానుకల వర్షం కురుస్తోంది.
ఒకవైపు.. వెండి, బంగారం, ముత్యం, పగడం, వైఢూర్యాది ఆభరణాలు కానుకలుగా వస్తుంటే.. మరోవైపు.. శ్రీవారికి నగదు రూపంలో భారీగా విరాళాలు అందుతున్నాయి.
తాజాగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి ముంబై వాసులైన ఇద్దరు భక్తులు రూ. 55లక్షల విరాళం సమర్పించారు. తిరుమల ప్రత్యేకాధికారి ధర్మారెడ్డికి గురువారం డీడీల రూపంలో ఈ సొమ్మును అందజేశారు.
వీరిలో వీరేంద్ర మహేష్ ఖరూప్ రూ. 51లక్షలు, మనోజ్ శరఫ్ రూ.4లక్షలను విరాళంగా అందజేసినట్లు తితిదే విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. దీన్ని అన్నదానం, ప్రాణదానం పథకాలకు వినియోగించాల్సిందిగా వారు కోరారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే ఉద్యోగులకు ప్రతి ఏటా బ్రహ్మోత్సవ బహుమానాన్ని ఈ ఏడాది రూ. 4వేల నుంచి రూ. 7వేలకు పెంచనున్నట్లు టీటీడీ పాలకమండలి సమావేశం తీర్మానించింది.
మరోవైపు.. అన్ని స్థాయిల ఉద్యోగులకు ఒక పెద్దలడ్డు, వడ ఇవ్వాలని ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయ్యాయి. లోగడ స్వీపర్ స్థాయి నుంచి సీనియర్ అసిస్టెంట్ వరకు చిన్న లడ్డు, వడ ఇచ్చేవారు.
అయితే ఇకపై బహుమానం విషయంలో ఉద్యోగుల స్థాయిభేదాలను పరిగణించరాదనే ఉద్దేశంతో అందరికీ ఒకే విధంగా స్వామివారి ప్రసాదాలు అందజేస్తారని తితిదే ఓ ప్రకటనలో తెలిపింది.