శ్రీవారి దర్శనార్థం తిరుమల తిరుపతి దేవస్థానం బుధవారం అమలు చేసిన శీఘ్రదర్శనంలో మార్పులు చేసింది. శీఘ్రదర్శనాన్ని పటిష్టంగా అమలు చేయడంలో భాగంగా తితిదే పలు చర్యలు తీసుకుంది.
ఇందులో భాగంగా.. శుక్ర, శని, ఆదివారం రోజుల్లో రాత్రి పూట బ్రేక్ దర్శనాలు ఉండవని తితిదే ఈవో ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. రాత్రి పూట బ్రేక్ దర్శనాలు 7.30 నుంచి 8.30 గంటల మధ్య ఉంటాయని, ఉదయం మాత్రం టిక్కెట్లలో సూచించిన సమయానికే చేరుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
శని, ఆది, సోమవారాల్లో ఉదయం 4 గంటల నుంచి ఐదు, ఉదయం 7 నుంచి సాయంత్రం ఆరుగంటలు, రాత్రి 9 నుంచి ఏకాంత సేవ వరకు శీఘ్రదర్శనం టిక్కెట్లను భక్తులకు జారీ చేస్తారు.
అదేవిధంగా మంగళవారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం ఆరుగంటలు, రాత్రి 9 నుంచి ఏకాంత సేవ వరకు, బుధవారం ఉదయం 9.30 నుంచి సాయంత్రం ఆరుగంటలు, రాత్రి 9 నుంచి ఏకాంత సేవ వరకు, గురువారం ఉదయం 9 నుంచి సాయంత్రం ఆరు వరకు, రాత్రి 9 నుంచి ఏకాంత సేవ వరకు శీఘ్రదర్శనం టిక్కెట్లు లభిస్తాయి.
అలాగే శుక్రవాకం ఉదయం పది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు, రాత్రి 9 నుంచి ఏకాంత సేవ వరకు టిక్కెట్లు జారీ చేస్తామని ఈవో తెలిపారు.
అలాగే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టిక్కెట్లు కలిగిన భక్తులు, కొత్తగా వివాహం చేసుకున్న దంపతులు సుపధం వద్ద వైకుంఠం-1లోకి ప్రవేశించాల్సి ఉంటుందని కృష్ణారావు వెల్లడించారు.
అదేవిధంగా ఉచిత సుదర్శనం టిక్కెట్లు పొందిన యాత్రికులను వైకుంఠం-2లో, కాలినడకన వచ్చే భక్తుల ప్రవేశమార్గంలో అనుమతిస్తామనిస వీరి కోసం అదనంగా రెండు కంపార్ట్మెంట్లను కేటాయించామని ఈవో తెలిపారు.
ఇకపోతే.. వైకుంఠం-1 ముఖద్వారం వద్ద ఉన్న ఆరు క్యాలైన్లలో మూడింటిని శీఘ్రదర్శనం, మరో మూడు లైన్లను సుదర్శన సుదర్శనం రూ.50 టిక్కెట్లు కలిగిన భక్తులకు ప్రవేశం కల్పిస్తామని వివరించారు.
తద్వారా భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా శ్రీవారిని దర్శించుకునే అవకాశం లభిస్తుందన్నారు. భక్తులు ఇకపై తప్పనిసరిగా శ్రీవారి సేవలు, ఉత్సవాలు, బ్రేక్ దర్శనాలకు నిర్ణయించిన సమయానికి ఆలయానికి చేరుకోవాలని సూచించారు.