కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని శైవక్షేత్రాలు భక్తులతో నిండిపోయాయి. కార్తీక మాసం రెండో సోమవారమైన నేడు శ్రీశైలం భక్తులతో కిటకిటలాడుతోంది. మల్లన్న స్వామిని దర్శించుకునేందుకు భారీ ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.
స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరి ఉన్నారు. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని మల్లేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
ఇలాగే రాష్ట్రంలోని పంచారామక్షేత్రాల్లోనూ కార్తీక సోమవారం పూజలు ఘనంగా జరుగుతున్నాయి. రుద్రాభిషేకాలు, బిల్వదళాలతో పరమాత్మకు జరిగే పూజలను వీక్షించేందుకు వేలాది మంది భక్తులు పోటీపడుతున్నారు.
ఇకపోతే.. కార్తీకమాసం ఈశ్వరారాధనకు చాలా ముఖ్యమైనది. ఈ మాసంలో వచ్చే సోమవారం అత్యంత పుణ్యప్రదమైనది. ఈ మాసములో వచ్చే సోమవారాల్లో ఉపవాస దీక్షలు చేస్తూ.. రుద్రాభిషేకాలు, దీపారాధన చేసే వారికి పుణ్యఫలం లభిస్తుందని పండితులు అంటున్నారు.