తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఐదో విడత కళ్యాణమస్తు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ఐదోవిడత కళ్యాణమస్తులో ఏకంగా 8, 087 జంటలు ఒక్కటయ్యాయి.
ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రారంభించగా, గవర్నర్ ఎన్డీ తివారీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి వధువుకు బంగారపు తాళిబొట్టు, మెట్టెలు, వస్త్రాలను టీటీడీ నిర్వాహకులు అందజేశారు. హైదరాబాద్లోని లలిత కళాతోరణంలో 178 జంటలు ఈ వివాహ బంధంతో ఒకటయ్యాయి.
ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన రోశయ్య మాట్లాడుతూ.. ఇన్ని జంటలకు ఏకకాలంలో పెళ్ళిళ్ళు జరుగుతుండటం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
హైదరాబాద్లో జరిగిన కళ్యాణమస్తు కార్యక్రమంలో విదేశీ యువతిని ఆంధ్రాయువకుడు పెళ్లాడటం ఈ కార్యక్రమానికి ప్రత్యేక శోభనిచ్చింది. హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ క్రాంతి చైతన్య, లండన్కు చెందిన మారియెట్ను ప్రేమించాడు. ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించి.. కళ్యాణమస్తులో వారిద్దరిని ఏకం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు గల్లా అరుణ, సబితా ఇంద్రారెడ్డి పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు.
కాగా... కళ్యాణమస్తు కార్యక్రమం ద్వారా ఖమ్మంలో 1494, విశాఖలో 492, నల్లగొండలో 363, చిత్తూరులో 272, కడపలో 137 జంటలు ఏకమయ్యాయి.