ప్రధాన పేజి » ఆధ్యాత్మికం » ఆధ్యాత్మికం » వార్తలు » ఆంగ్లసంవత్సరాది నాడు శ్రీవారి ఆలయం మూసివేత! (Tirumala| Tirupati| Sri Venkateswara| New Year| January 1| Devotees| Chandra Grahana)
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమలేశుని ఆలయం ఆంగ్లసంవత్సరాది నాడు మూతపడనుంది. డిసెంబర్ 31వ తేదీ రాత్రి చంద్రగ్రహణం ఏర్పడుతున్న కారణంతో జనవరి ఒకటో తేదీ శ్రీవారి ఆలయం మూతపడుతుందని తితిదే ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రతి ఏడాది డిసెంబర్ 31 రాత్రి 12 గంటలకుపైగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం పరిపాటి.
అందులోనూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీవారి ఆలయంలో జరిగే పూజల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆంగ్లసంవత్సరాది ప్రారంభం రోజున వేలాది మంది భక్తులు వెంకన్న స్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు తండోపతండాలుగా చేరుకుంటారు. ఈ సంవత్సరంలో శుభం కలగాలని ఆకాంక్షిస్తూ.. డిసెంబర్ 31వ తేదీనే భక్తులు తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారు.
అయితే ఈ ఏడాది చంద్రగ్రహణంతో ఆంగ్లసంవత్సరాది రోజున శ్రీవారి ఆలయం మూతపడనుంది. దీంతో వెంకన్న స్వామిని దర్శించుకుంటే కొత్త సంవత్సరమంతా మంచే జరుగుతుందని తిరుమలకు చేరుకునే భక్తులకు ఇది చేదువార్త.
ఆంగ్లసంవత్సరాది రోజున చంద్రగ్రహణం ఏర్పడుతున్న కారణంతో.. డిసెంబర్ 31వ తేదీ రాత్రి 7 గంటలకు శ్రీవారి ఆలయం మూతపడుతుంది. మరుసటిరోజు జనవరి ఒకటో తేదీ ఉదయం ఏడుగంటలకు తిరిగి శ్రీవారి ఆలయాన్ని తెరిచి శుద్ధి కార్యక్రమాలు, పరిహార పూజలకు అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తామని తితిదే నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలియజేశారు.