భగవంతుడి దశావతారల్లో నరసింహ అవతారానికి ఎంతో విశిష్టత ఉంది. భక్తవరదుడిగానూ, దుష్టశిక్షకుడిగానూ, ధర్మ పరిరక్షకుడిగానూ యాదగిరి గుట్టలో దర్శనమిస్తోన్న లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకునే వారికి ఈతిబాధలు తొలగిపోయి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం.దుష్టశిక్షణార్థం అవతరించిన నరసింహస్వామికి సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం యాదగిరి గుట్టకు చాలా దగ్గర సంబంధం ఉందని పండితులు చెబుతున్నారు. అధర్ములను శిక్షించే సమయంలోనే ఉగ్రరూపంలో దర్శనమిచ్చే నరసింహస్వామి, భక్తులను అనుగ్రహించేటప్పుడు ఎంతో ప్రసన్నంగా కనిపిస్తుంటారు.పూర్వం యాదరుషి నరసింహ స్వామిని ప్రత్యక్షం చేసుకునే దిశగా ఘోర తపస్సు చేశాడు. యాదగిరి ఘోర తపస్సుకు మెచ్చి నరసింహుడు పెద్ద జ్వాల రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ సమయంలో నరసింహస్వామి ప్రత్యక్షమైన గిరి తన పేరున అంటే యాదరిగిగా ప్రసిద్ధి కావాలని వరం కోరాడు.భక్తుని కోరిక మేరకు స్వామి అనుగ్రహించి ఆరు కోణాలతో ఉన్న ఒక దివ్యచక్రరూపంలో ఆలయ గోపురం ఉంటూ దర్శనానికి వచ్చే భక్తులను కాపాడుతూ ఉంటానని కూడా చెప్పాడు.అనంతరం జ్వాలారూపంలో విష్ణుకుండం (స్వామి వారి పుష్కరిణి) ప్రవేశించి అంతర్దానమైనట్లు పండితులు చెబుతున్నారు. (పూర్వం జ్వాలానరసింహస్వామి పాదాలను అభిషేకించేందుకు బ్రహ్మదేవుడు తెచ్చిన గంగే విష్ణుకుండంలోకి ఇప్పటికీ ప్రవహిస్తోందని భక్తుల నమ్మకం.) దీంతో యాదరుషి తపస్సు చేసిన గిరి యాదగిరిగా, అక్కడున్న గుట్ట యాదగిరి గుట్టగా ప్రసిద్ధి చెందిదని పురాణాలు పేర్కొంటున్నాయి.ఇక్కడున్న క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి అని, నరసింహస్వామి మూడు రకాలైన రూపాల్లో భక్తులకు దర్శనమిస్తాడని పండితులు అంటున్నారు.ఇందులో మొదటిది.. ప్రహ్లాదుడి కోరిక మేరకు దుష్టశిక్షణార్థం ధరించిన ఉగ్రరూపాన్ని, యాదరిషికి దర్శనమిచ్చిన జ్వాలానరసిహస్వామి రూపం, యాదగిరికి వచ్చే భక్తులను అనుగ్రహిస్తూ ఉండే లక్ష్మీనరసింహస్వామి రూపం. అందుచేత మూడు రూపాల్లో దర్శనమిచ్చే నరసింహస్వామిని వార్షిక బ్రహ్మోత్సవాలు, పర్వదినాల్లో మాత్రమే కాకుండా, మామూలు రోజుల్లో దర్శించుకునే వారికి పుణ్యఫలితాలు చేకూరుతాయని విశ్వాసం.యాదగిరి గుట్టకు ఎలా వెళ్లాలంటే.. రాష్ట్రంలోని నల్గొండ జిల్లాకు చెందిన ఓ మండలం యాదగిరి గుట్ట. హైదరాబాదు నుండి వరంగల్లు రహదారిలో 50 కి.మీ. దూరంలో ఉంది. నల్గొండ నుంచి యాదగిరి గుట్టకు ఆర్టీస్ బస్సుల ద్వారా చేరుకోవచ్చు. |