అజ్మీర్ షరీఫ్లోని ఖ్వాజా మొయినుద్దీన్ చిస్టీ దర్గా భారత దేశంలోని అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న ముస్లీం పుణ్యక్షేత్రాలలో ఒకటిగా భాసిల్లుతున్నది. సర్వమతాల ప్రజల భక్తివిశ్వాసాలను ఈ దర్గా చూరగొంటున్నది. ముస్లీం మతాచార్యుడు ఖ్వాజా మొయినుద్దీన్ చిస్టీ సమాధి చెందిన స్థలమే అజ్మీర్ షరీఫ్ దర్గాగా రూపాంతరం చెందింది.
భారత్ మరియు పాకిస్థాన్ దేశాలలోని అత్యంత ప్రముఖమైన సూఫీ సంఘాలకు చెందిన చిస్టీ సూఫీ పరంపరను హజ్రత్ మొయినుద్దీన్ చిస్టీ వ్యవస్థాపించారు. తమ ధార్మిక చింతన, ఆకర్షణ శక్తి, దీవెనలు మరియు సేవల ద్వారా సూఫీ బోధకులు ఇస్లాం మతవ్యాప్తిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. 1190 సంవత్సరం నుంచి తాను దేహాన్ని త్యజించే వరకు అనగా 1232 సంవత్సరం దాకా మొయినుద్దీన్ అజ్మీర్లో జీవించారు.
మరణానంతరం సైతం మొయినుద్దీన పట్ల గల పూజ్యభావం వారి సమాధి పొందే ప్రాపకం రూపంలో వీక్షించవచ్చు. సమాధి శిఖరంపై ప్రతిష్ఠితమైన కిరీటం స్వచ్ఛమైన బంగారంతో చేయబడింది. ఇక కంటికి ఎదురుగా కనిపించే ఖాళీ స్థలంలో ఒక మసీదును మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించాడు.
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కొంత కాలవ్యవధిలో దర్గాను నిర్మించే క్రమంలో పలువురు మొఘల్ పాలకులు తమ వంతు కృషిని చేసారు. ఒకానొకప్పుడు సాధారణ స్థితిలో ఉన్న మతాచార్యుని సమాధి, నేడు ఒక దర్గాగా రూపాంతరం చెందినదై పలు మసీదులు, మండపాలు మరియు సింహద్వారాలకు నెలవైన అతి పెద్ద సముదాయంగా అవతరించింది.
|