పురాణేతిహాసాలను అనుసరించి దేవతలను ప్రసన్నం చేసుకుని వరాలు పొందిన రాక్షసులు, వరగర్వంతో భూమిపై రుషులను హింసించడం ప్రారంభించారు. రాక్షసులను తుదముట్టించేందుకు పార్వతీ దేవి పలు అవతారాలను దాల్చింది. శంభు మరియు నిశంభును సంహరించేందుకు కౌశకిగాను, మహిషాసురుని సంహరించేందుకు మహిషాసుర మర్ధినిగాను, దుర్గమాసురుని తుదముట్టించేందుకు దుర్గగాను పార్వతీ దేవి అవతారమెత్తింది.
దుష్టశిక్షణ, శిష్టరక్షణలో భాగంగా తాను వసించేందుకుగాను పర్వతరూపం దాల్చవలసిందిగా తన భక్తుడైన కీలుడుని కనకదుర్గాదేవి కోరింది. తదనుగుణంగా ఏర్పడిన కీలాద్రి దుర్గాదేవి కొలువుండే పర్వతంగా ప్రాచుర్యాన్ని పొందింది. అనంతరం మహిషామర్ధిని అవతారాన్ని దాల్చిన కనకదుర్గ ఎనిమిది హస్తాలలో రకరకాల ఆయుధాలను ధరించి, సింహాన్ని అధిరోహించినదై ఇంద్రకీలాద్రి పర్వతంపై మహిషాసురుని సంహరించింది.
ఆమె పతిదేవుడైన మహాశివుడు సమీపంలోని పర్వతశిలపై జ్యోతిర్లింగంగా అవతరించాడు. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఆ జ్యోతిర్లింగాన్ని మల్లెలతో పూజించిన0దున మహాశివునికి మల్లేశ్వరస్వామి అన్న నామధేయం సంప్రాప్తించింది. ఇంద్రాదిదేవతలు కీలాద్రి పర్వత్రాన్ని దర్శించుకోవడంతో ఈ పర్వతానికి ఇంద్రకీలాద్రి పర్వతం అన్న పేరు బహుళప్రాచుర్యంలోకి వచ్చింది.
సంప్రదాయాన్ని అనుసరించి దేవతలు తమ పతిదేవులకు ఎడమవైపు స్థానంలో ఉంటారు. కానీ ఇక్కడ దుర్గాదేవి పతిదేవునికి కుడివైపున ఉంటుంది. తద్వారా ఇంద్రకీలాద్రి పర్వతంపై శక్తి యొక్క వైభవం ప్రస్ఫుటమవుతున్నది.
WD Photo
WD
నవరాత్రి ఉత్సవాలలో కనకదుర్గా దేవి రోజుకు ఒక అవతారంలో... బాలాత్రిపుర సుందరి, గాయత్రీమాత, అన్నపూర్ణ, మహాలక్ష్మి, సరస్వతి, లలితాత్రిపురసుందరి, దుర్గాదేవి, మహిషాసుర మర్ధిని మరియు రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిచ్చి భక్తులకు బాసటగా నిలిచి వారి మొక్కులను తీర్చే చల్లని తల్లిగా నీరాజనాలను అందుకుంటుంది.