కర్నాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లాలో సౌపర్ణికా నదీతీరాన దేవాలయ శాస్త్రాలను అనుసరించి వెలసిన అద్భుతమైన నిర్మాణం కొల్లూర్ మూకాంబికా దేవాలయం. ఇక్కడి దేవతకు గల అపారమైన శక్తులు సర్వత్రా వ్యాపితమై దేశం నలుమూలల నుంచి భక్తులు మూకాంబికా దేవాలయానికి పెద్ద సంఖ్యలో విచ్చేసి అమ్మవారి దయకు పాత్రులవుతున్నారు. ప్రశస్తమైన విజయదశమి ఇక్కడ విద్యాదశమిగా నామాంతరం చెందుతుంది. పవిత్రమైన విద్యాదశమినాడు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడకు విచ్చేసి తమ పిల్లల అక్షరాభ్యాసానికి శ్రీకారం చుడతారు.
స్థల పురాణం
కొల్లూర్ లేదా కొలాపురమనే పేరు కొల మహర్షి నుంచి సంక్రమించింది. కంహాసురుని సంహారంలో మహాలక్ష్మి ప్రమేయం కోరిన కొల మహిర్షి ఘోరమైన తపస్సు చేస్తాడు. కొలమహర్షి తపస్సుకు ప్రసన్నురాలైన మహాలక్ష్మి, పరమేశ్వరుని నుంచి అమరత్వ సిద్ధికై తపస్సు చేస్తున్న కంహాసురుని మూగవానిగా మార్చుతుంది. అనంతరం కంహాసురుడు మూకాసురుడనే నామంతో ప్రసిద్ధినొందుతాడు.
మూగవాడైనప్పటికీ కంహాసురుడు తన అసుర గుణాన్ని వదులుకోలేదు సరికదా దేవతలపై తన దాడిని మరింత ఉధృతం చేస్తాడు. హరిహరాదుల చేతిలో తనకు చావు రాకూడదంటూ మహాశివుని నుంచి పొందిన వరగర్వంతో మూకాసురుని ఆగడాలకు అడ్డు అదుపు లేకుండాపోతుంది. మహాలక్ష్మి తన గణంతో దండెత్తి మూకాసురుని సంహరిస్తుంది. ఆ విధంగా హరిహరాదుల చేతిలో కాకుండా సర్వశక్తి స్వరూపిణి అయిన ఒక స్త్రీ చేతిలో మూకాసురుడు సంహరించబడతాడు.
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
|