ప్రదర్శన శాల గోడలపై వాయునందనుని భక్తి ప్రపంచం చెక్కబడి ఉన్నది. ఈ శిల్పాలలో హనుమంతుని పరివారం, సీతారాములు, లక్ష్మీదేవి, మారుతి తండ్రి కేసరి, తల్లి అంజని, గురువు సూర్యభగవానుడు, వాయు దేవుడు కనిపిస్తారు.
అంతేకాక పవనసుతుని స్నేహితులైన సుగ్రీవుడు, అంగదుడు, నీలుడు, నలుడు, జాంబవంతుని చిత్రాలు కూడా ఇక్కడి శిల్పాలలో చోటు చేసుకున్నాయి. గోస్వామి తులసీదాస్ కూడా శిల్పాకృతిలో హనుమంతుని భక్తి ప్రపంచంలో కనిపిస్తారు.
ఈ ప్రదర్శనశాలలో ఆంజనేయ స్వామి భక్తి పాటలను కలిగిన పలు రకాల సీడీలు, క్యాసెట్లు దర్శనమిస్తుంటాయి. 250 పుస్తకాలతో పాటు హనుమంతుని ఆభరణాలైన కిరీటం, కర్ణాభరణాలు, గద, పతాకం, సింధూరం ఇక్కడ కనిపిస్తుంటాయి. ఆంజనేయ స్వామి భక్తి భావనా వాహినిని దేశవ్యాప్తంగా ప్రచారం చేసిన సాధుపుంగవులు నీమ్ రౌలీ బాబా, గురు సమర్థ రామదాసు చిత్రాలు తదితరాలు కూడా స్థానం సంపాదించుకున్నాయి.
ఆంజనేయస్వామి కోసం నిర్మితమైన 137 వెబ్సైట్ల సమాచారాన్ని ప్రదర్శనశాలలో పొందుపరిచారు. మూడు సంవత్సరాల క్రితం అనగా 2004 సంవత్సరం, నవంబర్ 21న ఈ ప్రదర్శనశాల అధికారికంగా తన కార్యకలాపాలను ప్రారంభించుకున్నది.
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రామచరిత్ మానస్లోని ఏడు అధ్యాయాలను ఆధారంగా చేసుకుని హంగేరీకి చెందిన హుమిల్ రోజెలియా (రాధికాప్రియా) రూపొందించిన అద్భుతమైన తైలవర్ణ చిత్రాలు సందర్శకులకు నేత్రపర్వంగా నిలుస్తున్నాయి. 1864 సంవత్సరంలో మహరాజా రంజిత్ సింగ్ జారీ చేసిన ఆంజనేయ స్వామి చిత్రాలను కలిగిన నాణేలు ఇక్కడ ప్రదర్శించబడుతున్నాయి.
|