శ్రీ కాళీమాత అమ్మవారి దేవస్థానం. ఈ దేవాలయం త్రిశక్తి పీఠమని పిలవబడుతున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణానది తీరంలోని విజయవాడలో నెలకొన్న ఈ పీఠం, ఆధునిక కాలంలోని అరుదైన దేవాలయంగా భక్తుల పూజలను అందుకుంటున్నది. త్రిశక్తి పీఠంలో శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహా సరస్వతి విగ్రహాలు నెలకొల్పబడి ఉన్నాయి. "ఇచ్ఛాశక్తి", "క్రియాశక్తి" మరియు "జ్ఞానశక్తి"కి ఈ పవిత్రమైన విగ్రహాలు ప్రతీకగా నిలుస్తున్నాయి. దేశంలోని "అష్ఠాదశ పీఠాల"కు గల పవిత్రతను ఈ పీఠం కలిగి ఉన్నది.
స్థలపురాణం: నెల్లూరుకు సమీపంలో గల అరణ్యంలో స్వయంభూవుగా అవతరించిన శ్రీమహాకాళి విగ్రహాన్ని మిలటరీ ఇంజనీర్ ఒకరు విజయవాడకు తీసుకువచ్చారు. పవిత్ర కృష్ణానదీ తీరంలో 1947 అక్టోబర్ 14వతేదీన శక్తిఉపాసకులైన గుంజా రామస్వామి శ్రీమహాకాళి విగ్రహాన్ని ప్రతిష్టించారు. చిన్నపాటి దేవాలయంలో 11 సంవత్సరాలు పాటు మహా పూజను నిర్వహించిన ఆయన "కాళిదాసు"గా ప్రసిద్ధులైనారు.
ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అనూహ్యమైన పరిస్థితులలో ఆ దేవాలయం మూతపడింది. దాదాపు 15 సంవత్సరాల తరువాత అనగా 1965 సంవత్సరంలో మరో భక్తుడు తురగా వెంకటేశ్వర్లు దేవాలయ తలుపులను తెరిచారు. ఆయనతోపాటు వచ్చిన వారిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తూ దేవాలయంలో వెలుగుతున్న "జ్యోతి" దర్శనమిచ్చింది. శ్రీమహాకాళి శక్తి వారి కన్నుల ఎదుట ఆ విధంగా ప్రదర్శితమైంది.
|