ఆసియా ఖండంలో అతిపెద్దదైన మసీదుగా పేరొందిన 'తాజూల్ మసీదు' భోపాల్ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పవిత్రమైన ఈ ప్రార్థన మందిరాన్ని 'జమా మసీదు'గాను 'మసీదులకు తలమానికం'గాను స్థానికులు పిలుచుకుంటారు. ఇక్కడ మీరు ఆధ్యాత్మిక భావనలను పొందవచ్చు. మసీదులోని ప్రధాన హాలులోకి దారి తీసే మార్గంలో ప్రధానమైన ఆవరణ మీకు కనిపిస్తుంది. ఆవరణలో ప్రధాన హాలును ప్రతిబింబించే తటాకం మిమ్మల్ని ఇట్టే ఆకర్షిస్తుంది. ప్రధాన హాలులో భక్తులు 'నమాజు' చేసుకుంటారు. ప్రధాన హాలుకు అనుబంధంగా అద్భుతమైన 'మదరసా' నిర్మితమై ఉంది.
గులాబీ వర్ణంతో అలరారే అతిపెద్దదైన ఈ మసీదు భారీ గుమ్మటపు పైకప్పును కలిగిన రెండు శ్వేత స్తంభాలు మరియు మూడు తెల్లని గుమ్మటాలు ప్రధాన భవంతిపై నిర్మితమై శోభాయామానంగా కనిపిస్తోంది. వైవిధ్యానికి నెలవైన ఈ స్మారక భవనం మానవీయతను కలిగించే పథ నిర్దేశాన్ని గావిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు. భోపాల్ ప్రాంత కళాకారులచే నిర్మించబడిన ఈ మసీదు, భారతీయ మరియు ఇస్లామీయ కళలతో కూడిన భవన నిర్మాణ పద్దతులతో భాసిల్లుతోంది.
మసీదు గోడలపై ఆహ్లాదాన్ని కలిగించే సౌందర్యభరిత పుష్పాలు చెక్కబడి ఉన్నాయి. మొఘల్ చక్రవర్తి షాజహాన్ సతీమణి కుదిసియా బేగం ఈ మసీదును నిర్మించారని నమ్మిక. ఈద్ పండుగ సమయంలో ఈ మసీదు సంపూర్ణమైన ఆధ్యాత్మిక వాతావరణానికి తార్కాణంగా నిలుస్తోంది. ఈద్ పండుగను పురస్కరించుకుని వేలాదిగా ఇక్కడకు విచ్చేసే భక్తులు తమ శిరసు వంచి వినమ్రంగా నమాజు చేస్తారు. కుల మత భేదాలకు అతీతంగా అన్ని మతాలకు చెందిన ప్రజలను ఈ మసీదు సాదరంగా అక్కున చేర్చుకుంటోంది.
|