పురాణాల్లో తెలిపిన 108 శక్తి క్షేత్రాల్లో ఒకటి కరివీర ప్రాంతం. దీనినే వర్తమాన కాలంలో కొల్హాపూర్గా పిలుస్తున్నారు. ఇక్కడ వెలసిన అమ్మవారే కొల్హాపూర్ మహాలక్ష్మి. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వక్షస్థల వాసిని శ్రీమహాలక్ష్మి.
శ్రీవారు కలియుగంలో అలివేలు మంగతాయారు (పద్మావతి) ను పరిణయమాడారు. పద్మావతిని కళ్యాణమాడిన శ్రీవారిపై భార్గవి నందని అయిన లక్ష్మీ అమ్మవారు అలిగారు. దీనితో అమ్మవారు వైకుంఠవాసుడికి విడిచి సహ్యాద్రి పర్వత ప్రాంతంలోని కొల్హాపూర్లో వెలిశారు.
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం ఉంది. పంచగంగ నది ఒడ్డున కొల్హాపూర్ నగరం ఉంది. కొల్హాపూర్ దేవాలయాన్ని క్రీస్తు శకం ఏడో దశాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన చాళుక్య రాజు కరణ్ దేవ్ కట్టించారు.
ఆ తర్వాత 9వ శతాబ్దంలో యాదవ రాజు వంశానికి చెందిన షిలాహార యాదవుడు మరింత అందంగా దేవాలయాన్ని తీర్చిదిద్దటానికి కృషిచేశాడు. దేవాలయంలో లోపల మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం స్వయం వ్యక్తమని ప్రజలు భావిస్తారు.
అమ్మవారికి అర్చకులు ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చైత్రమాసంలో వచ్చే పౌర్ణమితో పాటుగా నవరాత్రులపుడు అమ్మవారికి వేడుకలు జరుపుతారు.
|