ఆంధ్రరాష్ట్రంలోని పంచారామాల్లో ఒకటైన శ్రీకాళహస్తీశ్వరుని ఈసారి తీర్థయాత్రలో దర్శిద్దాం. పెన్నానది ఉపనది స్వర్ణముఖి నది ఒడ్డున వెలసి ఉన్న శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం దక్షిణభారత పుణ్యక్షేత్రాలలో ప్రసిద్ధిగాంచినది. పవిత్ర స్వర్ణముఖి నది ఒడ్డును ఆనుకుని కొండల నడుమన కొలువై ఉన్న ఈ పుణ్యక్షేత్రానికి దక్షిణ కాశి అనే పేరుకూడా ఉంది.
ఆలయంలో కళ్ళు చెదిరే మూడు గోపురాలు ప్రాచీన భారతీయ వాస్తు కళకు నిదర్శనాలు. వీటిలో ఎత్తైన గాలి గోపురం విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించబడింది. అత్యంత పెద్దదిగా కనిపించే వెయ్యి కాళ్ళ మంటపం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దక్షిణ భారతదేశంలోనే అతి ప్రాచీనమైన మరియు పంచభూతలింగములలో నాల్గవదైన వాయులింగము గల గొప్ప శైవ పుణ్యక్షేత్రము శ్రీకాళహస్తి. దేవాలయంలోని రెండు దీపాలలో ఒకటి ఎప్పుడూ గాలికి కదులుతూ ఉంటుంది, మరొకటి ఎల్లప్పుడు నిశ్చలముగా ఉంటుంది.
శ్రీ.. అంటే సాలెపురుగు, కాళ... అంటే పాము, హస్తి... అంటే ఏనుగు... ఇవి ఆ సర్వేశ్వరుని పూజించి మోక్షము నొందాయని అందువల్లనే ఈ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిగా ప్రసిద్ధిగాంచిందని చెప్పబడింది. పురాణ గాధను అనుసరించి ఆలయంలో కొలువున్న శివలింగం చుట్టూ సాలెపురుగు గూడుకట్టి ఆ స్వామివారిని పూజిస్తే... పాము ఓ మణిని శివలింగంపై ఉంచి ప్రార్థించేదనీ... అదేవిధంగా ఏనుగు పవిత్రజలంతో శివలింగాన్ని కడిగి అర్చించేదనీ తెలుపబడింది. దీనిని సూచిస్తూ దేవాలయంలో ఓ విగ్రహం మనకు కనబడుతుంది.
|