భక్తుల ప్రార్థనలతో సింహాచల క్షేత్రం మారుమోగుతోంది. వైశాఖమాసంలో మూడోరోజు అక్షయ తృతీయ సందర్భంగా వేల సంఖ్యలో భక్తులు సింహాచలేశుని దర్శించుకున్నారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవ కార్యక్రమాన్ని కనులారా చూసి తరించారు. ఏడాదిలో ఈ రోజు మాత్రమే స్వామివారు నిజరూప దర్శనమివ్వటం మరో విశేషం. స్వామివారు కొలువై ఉన్న ఈ దేవాలయాన్ని క్రీ.శ 11 శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తోంది. సింహాచలం అంటే సింహాచలమనే కొండకు రారాజు అయిన సింహాచలేశుడు విష్ణుమూర్తి నాలుగో అవతారం. తన భక్తుడు ప్రహ్లాదుని కాపాడేందుకు స్వామివారు కొండపైకి వేంచేశాడు.
స్థలపురాణాన్ననుసరించి కొండపై వెలిసిన నరసింహునికి ప్రహ్లాదుడే గుడి కట్టించాడని తెలుస్తోంది. నరసింహస్వామిచే హిరణ్యకశ్యపుడు సంహరించిన అనంతరం ఈ శుభకార్యాన్ని ప్రహ్లాదుడు ప్రారంభించాడు. అయితే కృతయుగం ఆఖరికి వచ్చేసరికి దేవాలయ బాగోగులు పట్టించుకునేవారు లేక శిథిలావస్తకు చేరుకుంది. నరసింహుని విగ్రహం చుట్టూ మట్టి పుట్టలుగా చేరిపోయింది. అయితే పురూరవుని కాలంలో తిరిగి సింహాచల దేవాలయం వెలుగులోకి వచ్చింది.
పురూరవుడు ఓసారి ఊర్విశితో గగన విహారం చేస్తుంటాడు. అలా విహారం చేస్తూ... సింహాచల కొండ దక్షిణ భాగానికి రాగానే ఏదో తెలియని శక్తి ఉన్నట్లు అతనికి గోచరిస్తుంది. ఈ పరిణామంతో సింహాచల గిరిపై దిగిన పురూరవునికి మట్టిపుట్టలమధ్య పూడుకుపోయి ఉన్న స్వామివారి విగ్రహాన్ని కనుగొంటాడు. ఆ మట్టిని తొలగిద్దామనుకున్న పురూరవునికి ఆకాశవాణి హెచ్చరిక వినబడుతుంది. స్వామివారి చుట్టూ ఉన్న మట్టిని తొలగించవద్దనీ... అయితే చందనంతో కప్పివేయమని చెపుతుంది.
|