దాదా దునివాలెజీ పేరు చెబితే షిర్డీ సాయిబాబా వంటి ఆధ్యాత్మిక గురువులు గుర్తుకువస్తారు. దాదాజీగా పిలువబడే స్వామీ కేశవానందజీ ఓ అద్భుత ఋషి. ఆయన నిత్యం మండుతున్న అగ్ని (ధుని) ముందు కూర్చునే ఉండేవారు. అందువల్లనే ఆయనకు దాదా దునివాలె అనే పేరు వచ్చింది. హిందీలో దాదా అంటే తాతయ్య అని అర్థం. శివుని అవతారంగా ఆయనకు పూజలు అందుకునేవారు.
అయితే ఆయన జీవిత చరిత్రకు సంబంధించిన ఖచ్చితమైన వివరాలు లేవు, కానీ ఆయనపై అనేక విశ్వాసాలు ఉన్నాయి. దాదా దర్బార్ ( దాదాజీ నివాసం) ఆయన సమాధి ప్రాంతంలోనే కొలువై ఉన్నది. గురుపూర్ణిమ పుణ్యదినాన ఇక్కడ జరిగే ఉత్సవంలో పాల్గొనేందుకు వేలమంది భక్తులు దేశం నలుమూలలనుంచే కాక విదేశాలనుంచి సైతం తరలివస్తారు.
దాదాజీ పేరన దేశంలోని వివిధ ప్రాంతాలలో 27 ధామ్లు ( దాదాజీని ప్రార్థించే పుణ్యస్థలాలు) పూజలందుకుంటున్నాయి. ఆయన జీవించి ఉన్న కాలంలో ధుని అని పిలువబడే అగ్ని నిత్యం వెలుగుతూ ఉండేది. 1930లో ఆయన సమాధిలోకి వెళ్లారు. ఆయన సమాధి ఖాండ్వా పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నది.
|