పరమేశ్వరుని ప్రసిద్ధమైన క్షేత్రాలలో వైద్యేశ్వరుని ఆలయం ఒకటి. భక్తుల కోరిన కోర్కెలు తీర్చేదేవునిగా కొలువై వున్న వైద్యేశ్వరుడు వ్యాధులతో బాధపడుతున్నవారికి వాటినుంచి ఉపశమనాన్ని కలిగిస్తాడని విశ్వాసం. వైద్యనాధన్ అంటే... చికిత్స చేసేవాడు... నేటి ఆధునిక కాలంలో వారినే వైద్యులని పిలుస్తున్నాం. వైద్యనాధుడు దాదాపు 4 వేల 480 రకాలైన వ్యాధులను నయం చేస్తాడని నమ్మకం.
ఈ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. రావణుడు సీతను అపహరించి తీసుకెళుతున్న సమయంలో సీతను కాపాడేందుకు ఈ ప్రదేశంలోనే జటాయువు అడ్డు తగులుతుంది. రావణుడితో హోరాహోరీగా పోరాడుతుంది. అయితే రావణుడు జటాయువు రెండు రెక్కలను తెగ నరికి సీతను కొనిపోతాడు. సీతను వెదుకుతూ వచ్చిన రామలక్ష్మణులకు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న జటాయువు కనబడుతుంది.
సీతను అపహరించిన విషయాన్ని జటాయువు ద్వారా తెలుసుకుంటారు రామలక్ష్మణులు. తను మరణించిన తర్వాత తనను అదే ప్రదేశంలో ఖననం చేయాల్సిందిగా రాముని వేడుకుంటుంది జటాయువు. దాని కోర్కె ప్రకారం శ్రీరామచంద్రుని చేత ఖననం చేయబడుతుంది. ఆ తర్వాత ఈ ప్రదేశాన్ని జటాయు కుండంగా భక్తులు పిలవటం ఆరంభించారు. కులమత విచక్షణ లేకుండా కుండంలోని విభూతిని ప్రతి భక్తుడు భక్తితో తీసుకుంటారు.
రావణుని వధించి సీతసమేతుడైన శ్రీరామచంద్రుడు ఇక్కడి పరమేశ్వరుని ఆలయంలో పూజలు నిర్వహించారని చెపుతారు. అంతేకాదు విశ్వామిత్రుడు, వశిష్టాది మహర్షులు ఈ దేవాలయంలో ప్రార్థనలు నిర్వహించారు.
కుష్టు వ్యాధికి గురైన అంగారకుడు ఈ ఆలయాన్ని దర్శించి పరమేశ్వరుని ప్రార్థించి తన వ్యాధిని నయం చేసుకోగలిగాడు. కనుకనే ఈ ఆలయం నవగ్రహ ఆలయాలలో ఒకటయింది. కుజదోషం ఉన్నవారు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లయితే వారి దోషప్రవృత్తి జరుగుతుంది. జాతక పత్రాలను అంగారకుని ముందు వుంచి ప్రత్యేక పూజలు సైతం నిర్వహిస్తారు.
|