ఈ వారం తీర్థయాత్రలో భాగంగా మహారాష్ట్రలోని అత్యంత ప్రసిద్ధి గాంచిన ఒక పుణ్యస్థలాన్ని మీకు పరిచయం చేస్తున్నాం. మహారాష్ట్రలో ఉన్న ముఖ్యమైన పట్టణాల్లో ఒకటైన అహ్మద్నగర్కు సమీపంలోని మొహాదే అనే ప్రాంతం ఉంది. ఇక్కడ శ్రీ జగదాంబ మాతా ఆలయం ఉంది. ఈ మాతను దర్శించుకునే భక్తులకు కోరిన కోర్కెలు, కష్టాలు తీరుతాయని బలమైన విశ్వాసం.
ఈ ఆలయం ఇక్కడ వెలిసేందుకు ఒక భక్తుడే ప్రధాన కారణం. అతని పేరే.. బన్సీ దహిఫలే. శక్తిపీఠాల్లో ఒకటైన మాహుర్ఘర్ అనే ప్రాంతంలో వెలసిన రేణుకా మాతకు తీవ్ర భక్తుడు. ప్రతిసారి అక్కడకు వెళ్లే భక్తుడు తమ గ్రామానికి వచ్చి వెలియాల్సిందిగా ప్రార్థించేవాడు. ఆయన కోర్కె ప్రకారం ఒక రోజు దహిఫలే కలలోకి వచ్చిన రేణుకా మాత.. ఆ గ్రామంలోని కొండ శిఖరంపై వెలసివున్నట్టు చెప్పింది. అప్పటి నుంచి భక్తుడు అక్కడకు వెళ్లి పూజలు చేసి, ప్రార్థినలు చేయసాగాడు.
రేణుక మాత మరో రూపమే శ్రీ జగదాంబ మాత పేరుగాంచింది. గురు రిషేదర్, గురు మచేంద్ర నాథ్, కానిఫ్ నాథ్, కాహినాథ్, జాలింగర్ నాథ్ నాగనాథ్ అనే ప్రముఖులు ఈ ఆలయానికి వచ్చి మాతను దర్శించుకున్నారు. ఆశ్వని నక్షత్రం, ఏకాదశి రోజున శ్రీ జగదాంబ మాతకు ఉత్సవాలను నిర్వహిస్తారు. ఆలయంలో లిఖించిన శిలాఫలకాలపై శ్రీజగదాంబ మాత తన శక్తిపీఠం వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఆలయానికి సమీపంలో శివాలయం ఉంది. దీనికి ఆనుకుని ఉన్న కోనేరులో పుణ్యస్నానం చేసిన తర్వాతే శ్రీ జగదాంబ మాతను దర్శనం చేసుకుమని భక్తులు చెపుతుంటారు.
|