ఈ ఆలయంలో నాలుగు వేల కిలోల ఆహార ధాన్యాలను రామచిలుకల కోసం ప్రతిరోజు వినియోగిస్తారు. ఆలయ ప్రాంగణంలో వెదజల్లే ఆహార ధాన్యాలను చిలుకలు ఆరగించే ముందుగా.. గర్భగుడిలోని హనుమంతుని విగ్రహం వైపు ఒక సారి చూసి తమ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తాయి. ఆ తర్వాత పశ్చిమ దిశకు తిరిగి ధ్యానం చేస్తాయి. నోరులేని ఈ చిలుకల భక్తిని చూసి ఇక్కడకు వచ్చే భక్తులు ఔరా..! అని ఆశ్చర్యం చెందుతారు.
ఇక్కడకు వచ్చే చిలుకల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో పలువురి భక్తుల సహాయంతో మూడు వేల చదరపుటడుగుల విస్తీర్ణంలో కాంక్రీట్ పైకప్పును ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ ఉదయం 5.30 గంటల నుంచి 6 గంటల వరకు, సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల మధ్య కాంక్రీట్ కప్పుమీద ధాన్యాలను వెదజల్లుతారు. ఇలా ధాన్యాలు వెదజల్లిన తర్వాత ఒక గంట కాలంలో వేలాది కేజీల ఆహార ధాన్యాలను రామచిలుకలు ఆరగిస్తాయని ఆలయ సిబ్బంది రమేష్ అగర్వాల్ తెలిపారు.
ఆలయానికి వచ్చే భక్తులు తమ ప్రార్థనలు పూర్తయిన తర్వాత ప్రసాదం ఆరగించే సమయంలోనే రామచిలుకలు కూడా ఆహారాన్ని ఆరగించడం ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడకు వచ్చే ప్రతి చిలుక, సాటి చిలుకలతో ఎదో సంబంధం కలిగి వున్నట్టుగా మెలగడం విశేషం. ఈ నోరులేని రామచిలుకల భక్తిని మీరు కూడా ప్రత్యక్షంగా చూసేందుకు ఈ ఆలయాన్ని సందర్శిస్తారని కోరుకుంటున్నాం. అలాగే.. ఈ రామచిలుకల భక్తిభావంపై మీ అమూల్యమైన అభిప్రాయాలను మాకు తెలియజేయండి. |