ఉప్పల్ స్టేడియంలో మార్పులు జరగక పోతే, రెండో సీజన్ ఐపీఎల్ మ్యాచ్లను నిర్వహించలేమని దక్కన్ ఛార్జర్స్ ఫ్రాంచైజీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గవర్నింగ్ కౌన్సిల్కు వెల్లడించింది. ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించేందుకు కావలసిన ప్రమాణాలు ఈ స్టేడియంలో లేవని ఛార్జర్స్ ఫ్రాంచైజీ తేల్చి చెప్పింది.ఈ మేరకు స్టేడియం, పరిసర ప్రాంతాలలో దాదాపు వంద ఫోటోలను తీసిన దక్కన్ ఫ్రాంచైజీ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్కు అందజేసింది. పరిస్థితుల్లో మార్పు వచ్చి, సౌకర్యాల విషయంలో నాణ్యత పెరగనట్లయితే.. మ్యాచ్లు స్థాయికి తగ్గట్లుగా నిర్వహించడం కష్టసాధ్యమని వివరించింది.కాగా, ఉప్పల్ స్టేడియం విషయంలో ఐపీఎల్ జోక్యం చేసుకుని, మార్పులు చేయించేదాకా, వార్షిక ఫీజు చెల్లించమని బీబీసీఐకి దక్కన్ ఫ్రాంచైజీ తెలియజేసింది. ఐపీఎల్ ఫ్రాంచైజీలు అన్నీ కూడా వార్షిక ఫీజులు చెల్లించినప్పటికీ... దక్కన్ ఫ్రాంచైజీ మాత్రం చెల్లించలేదు. సీజన్ ఆరంభానికి ముందే డీసీ జట్టు 10.6 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉన్నట్లు సమాచారం.దీనిపై స్పందించిన ఐపీఎల్ కౌన్సిల్ త్వరలోనే ఓ బృందాన్ని హైదరాబాద్కు పంపనుంది. స్టేడియంను పరిశీలించిన మీదట ఈ బృందం తమ సిఫార్సులను కౌన్సిల్కు వెల్లడిస్తుంది.ఇదిలా ఉంటే... ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఏకపక్షంగా నిబంధనలను రూపొందిస్తుండటం వల్ల, దీన్ని ఎదుర్కొనేందుకు అన్ని ఫ్రాంచైజీలు ఒకేమాటమీద నిలబడాలన్న నిర్ణయానికి వచ్చాయి. అన్ని ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ ఓ సంఘాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఇవి భావిస్తున్నట్లు తెలుస్తోంది. గోవాలో ఆటగాళ్ల వేలంపాట జరిగిన సందర్భంగా కింగ్స్ ఎలెవన్ ఈ ప్రతిపాదనను చేసినట్లు సమాచారం. |