ఏప్రిల్ 10వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నమెంట్ మ్యాచ్లను థియేటర్లలో ప్రదర్శించేందుకు హక్కుల కోసం పలు మల్టీఫ్లెక్స్ చైన్ సంస్థలు పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రోజుకు కనీసం ఒక ఐపీఎల్ మ్యాచ్ను ప్రత్యక్షంగా ప్రసారం చేసేందుకు హక్కుల కోసం సంప్రదింపులు జరుపుతున్నాయి. పైగా.. స్టేడియంలో కనీస టికెట్ ధరలో సగం ధరకే... స్టేడియంలో కూర్చొని మ్యాచ్ను ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతిని కల్పిస్తామని మల్టీఫ్లెక్స్ సంస్థలు హామీనిస్తున్నాయి కూడా. క్రికెట్ ఆటకు సంబంధించినంతవరకూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) థియేటర్ హక్కులు కలిగి ఉండగా, భారతదేశంలో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు కేబుల్, డైరెక్ట్ టు హోం (డీటీహెచ్) ప్రసార హక్కులు మాత్రం సెట్ మాక్స్ ఆధీనంలో ఉన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ మ్యాచ్ల ప్రసారానికి సంబంధించిన థియేటర్ హక్కులు తమకు లేనందున, నేరుగా బీసీసీఐనే సంప్రదించాలని సెట్ మాక్స్ నిర్వాహకులు మల్టీఫ్లెక్స్ సంస్థలకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే అయితే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు రెవెన్యూలో వాటా, కనీస గ్యారంటీ తదితర అంశాలపై ఒప్పందం కుదుర్చుకోడానికి ప్రస్తుతం సెట్ మాక్స్ తో చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.ఇదే విషయాన్ని బీసీసీఐ నిర్ధారిస్తూ... షరతులు, ఒప్పందాలపై చర్చలు ఓ కొలిక్కి వస్తున్నాయని, త్వరలోనే తగిన నిర్ణయం తీసుకోనున్నామని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. ఇదిలా ఉంటే... ఐపీఎల్ మ్యాచ్ల ప్రదర్శన హక్కులు మల్టీఫ్లెక్స్లకు లభించినట్లయితే... టెలివిజన్ రేటింగ్ పడిపోతుందని సెట్మాక్స్ నిర్వాహకులు జంకుతో ఉన్నారు. మరోవైపు... మామూలుగా సినిమాలు ప్రదర్శిస్తున్నట్లుగానే, థియేటర్ హక్కులు గల సంస్థతో రెవెన్యూలో వాటా తీసుకోడానికి అభ్యంతరం లేదని మల్టీప్లెక్స్ థియేటర్ల యజమానులు స్పష్టంగా చెబుతున్నారు. అయితే మల్టీఫ్లెక్స్ సంస్థలు కోరుకుంటున్నట్లుగా థియేటర్లలో ఐపీఎల్ మ్యాచ్ల ప్రసారానికి అనుమతి లభిస్తుందో, లేదో కొన్ని రోజులు వేచిచూడాల్సిందే మరి...! |