దక్షిణాఫ్రికాలో జరుగుతోన్న ఐపీఎల్ రెండో సీజన్లో భాగంగా, చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బౌలర్లు విజృంభించారు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్లకు పరుగులివ్వకుండా, చెన్నై సూపర్ కింగ్స్ జట్టును 129 పరుగులకే కట్టడి చేశారు. దీంతో 19.4 ఓవర్లలోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 129 పరుగులు సాధించి ఆలౌట్ అయింది.
చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ హెడెన్ (60) అర్ధ సెంచరీతో రాణించినా మిగిలిన బ్యాట్స్మెన్లు విఫలమయ్యారు. తద్వారా చెన్నై జట్టు 130 పరుగుల స్వల్ప విజయలక్ష్యాన్ని బెంగుళూరు జట్టు ముందుంచగలిగింది.
అదేసమయంలో బెంగుళూరు జట్టు తరపున కుంబ్లే, వినయ్కుమార్, కలీస్లు రెండేసి వికెట్లు సాధించగా, ప్రవీణ్ కుమార్, మార్వేలు చెరో ఒక వికెట్ దక్కించుకున్నారు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై జట్టు ఓపెనర్ హెడెన్ అర్ధ సెంచరీతో రాణించడంతో భారీ స్కోరు దిశగా పయనించింది. అయితే హెడెన్ తర్వాత మిగిలిన బ్యాట్స్మెన్ పెద్దగా స్కోరు సాధించలేక పోవడంతో ఆ జట్టు భారీ స్కోరు సాధించలేకపోయింది.
హేడెన్ తర్వాత కెప్టెన్ ధోనీ (18), రైనా (13)లు మాత్రమే ఓ మోస్తరు పరుగులు సాధించారు. మిగిలిన వారంతా పది పరుగులకంటే తక్కువ స్కోరు వద్దే పెవిలియన్ ముఖం పట్టారు. |