ఐపీఎల్ రెండో సీజన్లో ముంబై ఇండియన్స్ సెమీఫైనల్ ఆశలు గల్లంతయ్యాయి. శనివారం ధోనీ సేన చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. దీంతో ధోనీసేనపై 7వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సెమీస్కు మరింత చేరువైంది.
ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని చెన్నై సూపర్ కింగ్స్ 3 వికెట్లను మాత్రమే కోల్పోయి సునాయాసంగా అధిగమించింది. కింగ్స్ బ్యాట్స్మన్ హేడెన్ మరోసారి విజృంభించడంతో కింగ్స్ గెలుపును నమోదు చేసుకుంది.
అయితే ఓపెనర్గా బరిలోకి దిగిన పార్థీవ్ పటేల్ ఖాతా తెరువకుండానే మలింగ బౌలింగ్లో ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి దిగిన రైనా (12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 20 పరుగులు) భారీ షాట్లతో ముంబై ఇండియన్స్ బౌలర్ల వెన్ను విరిచాడు. ఇంకా కింగ్స్ బ్యాట్స్మన్లలో బద్రినాథ్ (22), మహేంద్ర సింగ్ ధోనీ (23 నాటౌట్)తో చెన్నై సూపర్ కింగ్స్ 19.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి సునాయాసంగా గెలుపొందింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. స్టార్ ఆటగాడు జయసూర్య ధాటిగా ఆడి 30 పరుగులు చేయగా, యువ ఆటగాడు డుమినీ (54 బంతుల్లో 4ఫోర్లు, రెండు సిక్స్లతో 62 పరుగులు) చేసి మరోసారి జట్టును ఆదుకున్నాడు. అదేవిధంగా నాయర్ (33) పరుగులతో నాటౌట్గా నిలిచాడు.
ఇకపోతే.. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో, మోర్కెల్, త్యాగి, మురళీధరన్లు ఒక్కో వికెట్ చొప్పున మూడు వికెట్లు సాధించారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో మలింగ, కులకర్ణి, బ్రావోలు ఒక్కో వికెట్ చొప్పున మూడు వికెట్లు పడగొట్టారు.
మరోవైపు... తన బ్యాటింగ్తో మైదానంలో వీరవిహారం చేసిన హేడెన్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. |