దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఐపీఎల్ రెండో సీజన్లో భాగంగా.. చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య కీలక సెమీస్ పోరు ప్రారంభం కానుంది. బుధవారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓడినా సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంటుంది. అయితే చెన్నైని పంజాబ్ జట్టు అధిగమిస్తేనే సెమీస్లోకి అడుగుపెడుతుంది. లేనట్లైతే ప్రీతి జట్టు ఇంటి ముఖం పట్టాల్సిందే.
ఇకపోతే.. ఇరు జట్లలోనూ గట్టి పోటీనిచ్చే బ్యాట్స్మెన్లు ఉన్నారు. ఇందులో చెన్నై బ్యాటింగ్ అభిమానులను ఆకట్టుకుంది. అదేవిధంగా.. పంజాబ్ బ్యాట్స్మెన్లు కూడా ఫామ్లో ఉన్నారు. దీంతో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరుగుతుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. బ్రెట్లీ, ఇర్ఫాన్లు రాణిస్తే చెన్నై జోరుకు కళ్లెం వేయవచ్చు. అలా కాకుంటే హేడెన్, రైనా, ధోనీలను తక్కువ స్కోరుకే ఔట్ చేస్తే తప్ప పంజాబ్కు గెలుపు సాధ్యం కాదు.
విశేషమైన బ్యాటింగ్తో దూసుకెళ్తున్న చెన్నై జట్టులో హేడెన్ సూపర్ ఇన్నింగ్స్లు, సురేశ్ రైనా మెరుపులు విజయానికి ఎంతో ఉపయోగపడతాయి. అద్భుత క్రీడాకారులతో పాటు బ్యాటింగ్ లైనపే సూపర్ కింగ్స్ విజయానికి బలం.
ఇకపోతే పంజాబ్ జట్టు, బ్యాటింగ్ తడాఖాతో పాయింట్ల పట్టికలో నెంబర్వన్ స్థానంలో కొనసాగుతున్న ఢిల్లీని ఖంగుతినిపించిన సంగతి తెలిసిందే. తదనంతరం, కట్టుదిట్టమైన బౌలింగ్తో దక్కన్ ఛార్జర్స్కు మట్టికరిపించింది. ఈ నేపథ్యంలో.. చెన్నైకి చెక్ పెట్టి, సెమీస్ ఆశలను సజీవంగా చేసుకునే దిశగా పంజాబ్ కింగ్స్ పోరుకు సై అంటోంది. |