విశ్వవిజేతగా సొంతగడ్డపై కాలుమోపిన 'టీమ్ ఇండియా' సభ్యులకు భారత క్రికెట్ అభిమానులు నీరజనాలు పలికారు. ముంబై పురవీధుల్లో ఊరేగుతూ.. వాఖండే స్టేడియంకు టాపులేని బస్సులో వచ్చిన ధోనీ సేనకు అభిమానులు అపూర్వ రీతిలో ఆహ్వానం పలికారు. దాదాపు 30 కిలోమీటర్ల దూరం సాగిన ఈ విజయయాత్ర పొడవునా రోడ్లకిరువైపులా అభిమానులు బారులుతీరి, తమ అభిమాన క్రికెట్ హీరోలకు శుభాకాంక్షలు తెలిపారు.
అప్పటికే.. చిరుజల్లులతో తడిసిన ముంబై మహానగరంలో అభిమానులు చూపించిన ఆదరాభిమానాలకు క్రికెటర్లు ఉబ్బితబ్బిబ్బులయ్యారు. మరోపక్క అభిమానులను కట్టడి చేసేందుకు పోలీసులు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ పోలీసుల చర్యలను సైతం పట్టించుకోకుండా ఆనంద పారవశ్యంతో నృత్యం చేశారు.
అనంతరం వాఖండే స్టేడియంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు శరద్ పవార్తో పాటు.. బీసీసీఐ ప్రతినిధులు, జాతీయ చీఫ్ సెలక్టర్, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఆర్.ఆర్.పాటిల్, ఆ రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. అంతకుముందు సహారా విమానశ్రయానికి చేరుకున్న ధోనీ సేనకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్ రావ్ దేశ్ముఖ్తో పాటు.. బాలీవుడ్ నటుడు షారూక్ఖాన్ బీసీసీఐ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.
|