జాతి వివక్ష ఆరోపణలు ఎదుర్కొన్న భారత టర్బోనేటర్ హర్భజన్ సింగ్పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) మూడు టెస్టుల నిషేధం విధించింది. ఈ విషయాన్ని ఐసిసి రిఫరీ మైక్ ప్రోక్టర్ ఆదివారం రాత్రి ప్రకటించాడు. సిడ్నీలో ముగిసిన రెండో టెస్టు అనంతరం ఏకబిగువున ఆరున్నర గంటల పాటు కొనసాగిన విచారణలో భజ్జీని దోషిగా తేలాడని, అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రొక్టర్ వివరించాడు. ఈ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన బీసీసీఐ కమిషనర్ ఆఫ్ అప్పీల్స్కు దీనిని నివేదించింది.
విచారణలో భారత జట్టు తరపున కెప్టెన్ కుంబ్లే, సచిన్, మేనేజర్ చేతన్ చౌహాన్, మీడియా మేనేజర్ ఎం.వి శ్రీధర్లు భజ్జీ తరపున సాక్ష్యం ఇచ్చారు. జాతి వివక్ష ఆరోపణలు చేసినట్టు ఎలాంటి ఆధారాలు లేక పోయినా శిక్ష ఎలా విధిస్తారని జట్టు మేనేజ్మెంట్ ప్రశ్నించింది. భజ్జీ అలాంటి వ్యాఖ్యలు చేయడం తాము కూడా వినలేదంటూ ఫీల్డ్ అంపైర్లు పేర్కొనడం గమనార్హం. ఇదిలావుండగా.. భజ్జీపై నిషేధం విషయమై ఐసీసీ నుంచి తమకెలాంటి సమాచారం అందలేదని బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఢిల్లీలో తెలిపారు.
నిషేధంపై అప్పీలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. తిరిగి దీనిపై విచారణ పూర్తయ్యే వరకు భజ్జీ యథావిధిగా మ్యాచ్లు ఆడేందుకు అవకాశం ఉంది. ఇదిలావుండగా రెండో టెస్టులో ఆసిస్ క్రికెటర్ బ్రాడ్ హాగ్ తమను అసభ్య పదజాలంతో దూషించాడని భారత ఆటగాళ్లు ఫిర్యాదు చేశారు. దీనిపై సోమవారం (నేడు) విచారణ జరగనుంది.
|