అందరూ ఊహించినట్టుగానే భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన సందిగ్ధంలో పడింది. అంపైర్లు, ఆస్ట్రేలియా ఆటగాళ్ల వైఖరికి 'టీమ్ ఇండియా' నిరసన తెలియజేసింది. మూడో టెస్టు వేదికైన పెర్త్కు వెళ్లేందుకు నిరాకరించింది. అయితే.. ప్రాక్టీసు మ్యాచ్ జరిగే కాన్బెర్రాకు మాత్రం వెళ్ళనుంది. దీంతో.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు శరద్ పవార్ తన నివాసంలో సోమవారం అత్యవసరంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఆస్ట్రేలియాలో ఎదురవుతున్న సమస్యలను తక్షణం పరిష్కరించాలని భారత ఆటగాళ్లు బీసీసీఐను కోరారు. అంతేకాకుండా జాతివివక్ష ఆరోపణలు ఎదుర్కొన్న స్పిన్నర్ హర్భజన్ సింగ్పై ఐసిసి మూడు టెస్ట్ మ్యాచ్ల నిషేధం విధించిన విషయం తెల్సిందే. ఈ నిషేధ ఉత్తర్వు కాపీలను అందజేయాలని టీమ్ ఇండియా కోరుతోంది. అప్పటి వరకు సిడ్నీని వదిలి మూడో టెస్టు వేదికైన పెర్త్కు వెళ్ళబోమని తేల్చి చెప్పింది. ఇదిలావుండగా.. సిడ్నీలోని టీమ్ మేనేజ్మెంట్ బీసీసీఐ సమాధానం కోసం వేచివుంది.
|