రెండు వన్డే సిరీస్ల అనంతరం 'మాస్టర్ బ్లాస్టర్' సచిన్ టెండూల్కర్ జట్టులో చేరాడు. ఈనెలలో శ్రీలంక పర్యటనకు వెళ్ళనున్న భారత టెస్ట్ జట్టుకు ఎంపికైన విషయం తెల్సిందే. ఈ సిరీస్లో తన శక్తిమేరకు రాణిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. మిగిలిన జట్టు సభ్యులతో చేరేందుకు సచిన్ ఆదివారం చెన్నైకు వచ్చాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
ఇటీవల బంగ్లాదేశ్లో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్, పాక్ గడ్డపై జరిగిన ఆసియా కప్ టోర్నీలకు సచిన్ దూరమైన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఈనెల 23వ తేదీ నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు శ్రీలంకలో పర్యటించనున్న భారత టెస్ట్ జట్టు కోసం ఎంపిక చేసిన 16 మంది సభ్యులలో సచిన్కు చోటు కల్పించారు.
దీనిపై సచిన్ మాట్లాడుతూ.. నేను పూర్తి ఫిట్నెస్తో ఉన్నా. శ్రీలంక పర్యటనలో తన శక్తిమేరకు రాణిస్తానని చెప్పాడు. కాగా, అనిల్ కుంబ్లే నేతృత్వంలోని భారత జట్టు గురువారం మధ్యాహ్నం శ్రీలంక పర్యటనకు బయలుదేరివెళ్లనుంది. ప్రస్తుతం జట్టులోని ఆటగాళ్లు మంచి ఫామ్లో ఉన్నారు. ఇదే ఫామ్ను కొనసాగించిన పక్షంలో సిరీస్ను కైవసం చేసుకుంటామన్నారు.
శ్రీలంక మాయాజాల స్పిన్నర్ అజంతా మెండీస్ గురించి ప్రశ్నించగా, అతని బౌలింగ్ను నేను ఇంకా ఎదుర్కోలేదు. అందువల్ల దానిపై నేనేమీ వ్యాఖ్యానించదలచుకోలేదు. అక్కడకు వెళ్లి చూస్తాను అని సచిన్ సమాధానమిచ్చాడు.
|