పాకిస్థాన్ ఆతిథ్యమిచ్చే ఛాంపియన్స్ ట్రోఫీలో తమకు అవసరమైన భద్రతను కల్పిస్తే ఆడటానికి సిద్ధంగా ఉన్నానని ఆసీస్ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ప్రకటించారు. పాకిస్థాన్లో భద్రతకు ముప్పు ఏర్పడిందని తెలిపారు. ఇది విదేశీ జట్ల భద్రతపై ప్రభావం చూపుతుందని వివరించారు.
ఛాంపియన్స్ ట్రోఫీని మరోసారి కైవసం చేసుకోవడానికి ఆస్ట్రేలియా తహతహలాడుతుందని తెలియజేశారు. దీనిని అందుకోవడానికి తాము దూరంగా ఉండలేమన్నారు. ఇందుకోసం తమ జట్టు అహరహం కృషి చేస్తుందని వివరించారు. ఈ టోర్నీ నిర్వహణలో ఆతిథ్య జట్టు భద్రత విషయంలో రాజీపడదని ఆశాభావం వ్యక్తం చేశారు.
పాకిస్థాన్లో జరిగే టోర్నీలో తమ జట్టు పాల్గొనేదానిపై క్రికెట్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ ఆసోసియేషన్, ఆస్ట్రేలియన్ ప్లేయింగ్ గ్రూప్లు కలిసి కూర్చుని చర్చిస్తాయని హేడెన్ వివరించారు. పాకిస్థాన్లో నెలకొన్న భద్రతపై ఐసీసీ ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై నిర్ణయం త్వరలోనే రానుంది. ఈ టోర్నీని శ్రీలంక లేదా దక్షిణాఫ్రికాలలో నిర్వహించాలని ఐసీసీ ఆలోచనలో ఉంది.
|