సొంత గడ్డపై జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో శ్రీలంక పరుగుల వరద పారిస్తోంది. భారత బౌలర్లు పలు రకాల ప్రయోగాలు చేసినప్పటికీ లంక బ్యాట్స్మెన్స్ను అవుట్ చేయలేక నానా తంటాలు పడుతున్నారు. భారత్-శ్రీలంక జట్ల మధ్య ఈనెల 23వ తేదీన కొలంబో క్రికెట్ స్టేడియంలో తొలి టెస్ట్ ప్రారంభమైన విషయం తెల్సిందే. తొలుత టాస్ గెలిచిన లంక కెప్టెన్ జయవర్ధనే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి వరుణుడు అడ్డు తగలడంతో మ్యాచ్ సక్రమంగా సాగలేదు.
రెండో రోజున మాత్రం శ్రీలంక బ్యాట్స్మెన్స్ తమ బ్యాట్లకు పని చెప్పారు. ఓపెనర్ వర్నపురా (115), జయవర్ధనే (136), సమరవీర (127)లు సెంచరీలతో కదం తొక్కారు. మూడో రోజైన శుక్రవారం దిల్షాన్ (114 నాటౌట్) కూడా సెంచరీతో కదం తొక్కాడు. దీంతో లంక జట్టు ఆరు వికెట్ల నష్టానికి 582 పరుగులు చేసింది. జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ, హర్భజన్ సింగ్ రెండేసి వికెట్లు తీశారు. ప్రస్తుతం దిల్షాన్, చమిందా వాస్లు క్రీజ్లో ఉన్నారు.
|