ట్వంటీ20 మ్యాచ్ ఫార్మాట్కు వీవీఎస్ లక్ష్మణ్ పనికిరాడంటూ తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని పాకిస్థాన్ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది పేర్కొన్నాడు. లక్ష్మణ్ గురించి తాను చేసినట్టు వస్తున్న వార్తలు మీడియా సృష్టేనని అఫ్రిది వ్యాఖ్యానించాడు.
ఈ విషయమై అఫ్రిది మాట్లాడుతూ లక్ష్మణ్ విషయంలో తనపై వచ్చిన ఆరోపణల గురించి దక్కన్ ఛార్జర్స్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ రైట్స్ తనతో మాట్లాడినట్టు అఫ్రిది తెలిపాడు. ఈ సందర్భంగా లక్ష్మణ్ గురించి తాను ఎలాంటి విమర్శనాత్మక వ్యాఖ్యలు చేయలేదని తాను ఆయనతో చెప్పానని అఫ్రిది పేర్కొన్నాడు.
లక్ష్మణ్ గురించి మీడియాలో తాను ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని కావాలంటే మీడియా టేపులను కూడా పరిశీలించవచ్చని అఫ్రిది స్పష్టం చేశాడు. బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఐపీఎల్ టోర్నీలో హైదరాబాద్ జట్టుగా బరిలో దిగిన దక్కన్ ఛార్జర్స్ అట్టడుగు స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.
అయితే జట్టు పరాజయాలకు కెప్టెన్ వీవీఎస్ లక్ష్మణే కారణం అంటూ విమర్శలు వచ్చాయి. అదేసమయంలో ట్వంటీ20 ఫార్మాట్కు లక్ష్మణ్ సరిపోడని అతని స్థానంలో వైస్ కెప్టెన్ గిల్క్రిస్ట్కు సారథ్య బాధ్యతలు అప్పగించాలని అఫ్రిది పేర్కొన్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయి.
అఫ్రిది వ్యాఖ్యల ఫలితమో లేక సొంత నిర్ణయమో తెలియదు గానీ దక్కన్ ఛార్జర్స్ తమ జట్టు సారథ్య బాధ్యతల నుంచి లక్ష్మణ్ను తొలగించి అతని స్థానంలో గిల్క్రిస్ట్ను నియమించింది. |