ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్ నోరు జారి తప్పుడు ప్రకటన చేశాడని టీం ఇండియా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తెలిపారు. తన క్రీడా స్ఫూర్తిని, నిజాయితీని ప్రశ్నిస్తూ గిల్క్రిస్ట్ చేసిన వివాదాస్పద ప్రకటనపై సచిన్ టెండూల్కర్ మొదటిసారిగా స్పందించాడు. తన గురించి సరిగా తెలియని వ్యక్తి ఇటువంటి తప్పుడు ప్రకటన చేశాడని సచిన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. గిల్లీ తనపై చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యపరిచాయని, తనకు క్రీడా స్ఫూర్తి లేదనడం అసత్యమని సచిన్ స్పష్టం చేశాడు. ఆటను ఎంతగానో ప్రేమిస్తున్నానని, తన గురించి పూర్తిగా తెలియని వ్యక్తి ఒకరు ఇటువంటి తప్పుడు ప్రకటన చేశాడని భావిస్తున్నానని సచిన్ పేర్కొన్నాడు. గత ఏడాది సిడ్నీ టెస్ట్ సమయంలో జరిగిన కొన్ని సంఘటనలను గిల్క్రిస్ట్ తన ఆత్మకథలో (ట్రూ కలర్స్) వివాదాస్పద రీతిలో ప్రస్తావించిన సంగతి విదితమే.వివాదాస్పద వ్యాఖ్యలపై గిల్క్రిస్ట్ తనకు ఫోన్ చేశాడని సచిన్ ఈ సందర్భంగా ధృవీకరించాడు. మైదానం వీడే సమయంలో కరచాలనం చేసేందుకు భజ్జీ, సచిన్ చాలాసార్లు అందుబాటులో లేరని గిల్లీ చేసిన వ్యాఖ్యలపై సచిన్ మాట్లాడుతూ... మైదానాన్ని వీడే సమయంలో కరచాలనం చేసే సంస్కృతిని ఏనాడూ వీడింది లేదని, సిడ్నీ టెస్ట్ సమయంలోనూ మ్యాచ్ ముగిసిన తరువాత తానే మొదట కరచాలనం చేశానని సచిన్ తేల్చి చెప్పాడు. |
సంబంధిత సమాచారం కోసం శోధించండి. |