మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని "టీం ఇండియా" గత కొన్నేళ్లుగా స్వదేశంలో, విదేశాల్లోనూ సాధించిన విజయాలను చూసి పొంగిపోని భారత క్రికెట్ అభిమాని లేడంటే అతిశయోక్తి కాదు. విధ్వంసకర ఓపెనర్లు, బలమైన బ్యాటింగ్ లైనప్, మెరుగుపడిన బౌలింగ్ వనరులు, సమిష్టితత్వం.. ఇలా కారణాలు ఏవైతేనేం జట్టు బాగా ఆడింది. అభిమానులు కూడా సంబరపడ్డారు.
ఇప్పుడు ఇంగ్లాండ్లో జరుగుతున్న ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్లో మాత్రం జట్టు సూపర్ ఎయిట్ దశలో వరుసగా రెండు పరాజయాలు ఎదురుకావడంతో ఇంటిముఖం పట్టింది. క్రికెట్ పెద్దల నుంచి సాధారణ అభిమాని వరకు జట్టు వైఫల్యానికి కారణాలు చర్చించుకునే పనిలో పడ్డారు. ఇప్పుడు ఇన్నాళ్లూ ప్రశంసించిన, గుడికట్టిన అభిమానులు ధోనీ దిష్టిబొమ్మను తగలబెట్టి ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.
ట్వంటీ- 20 ప్రపంచకప్లో డిఫెండింగ్ ఛాంపియన్గా, టైటిల్ ఫేవరెట్గా బరిలో దిగిన టీం ఇండియా వైఫల్యానికి కారణాలు అనేకం. టోర్నీ ప్రారంభం నుంచే ధోనీలో స్పష్టంగా కనిపించిన అసహనం, సెహ్వాగ్- ధోనీ మధ్య విభేదాలు ఉన్నట్లు వచ్చిన వార్తలు, భుజం గాయంతో సెహ్వాగ్ టోర్నీ మొత్తానికి దూరంగా కావడం, పేలవమైన ఫీల్డింగ్, బ్యాటింగ్ వైఫల్యం తదితర అంశాలు భారత్ ఇంటిముఖం పట్టడానికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.
సెహ్వాగ్ వంటి ఆటగాడికి, అతని తరహా విధ్వంసకర బ్యాటింగ్కు అతితక్కువ సమయంలో ప్రత్యామ్నాయం కనుగొనడం సులభసాధ్యం కాదు. ఈ విషయాన్ని జట్టు కెప్టెన్ ధోనీనే స్వయంగా అంగీకరించాడు. సెహ్వాగ్ను దూరం చేసుకోవడం జట్టుకు ఎదురుదెబ్బేనని చెప్పాడు. ఓపెనింగ్లో కొరవడిన ఎదురుదాడి, దారితప్పిన ఫీల్డింగ్, లక్ష్యాన్ని ఛేదించే ఫినిషింగ్ లోటు తదితర లోపాలు మొదటి రెండు సూపర్ ఎయిట్ మ్యాచ్లలో జట్టు పరాజయాలకు కారణమయ్యాయి.
ఇదిలా ఉంటే బలమవుతుందనుకున్న ఐపీఎల్ కూడా టీం ఇండియాకు లేనిపోని సమస్యలు తెచ్చిపెట్టింది. ఐపీఎల్లో ఆడిన విదేశీ ఆటగాళ్లు ఇప్పుడు ప్రపంచకప్లో చెలరేగి ఆడుతున్నారు. టీం ఇండియాలోని అందరు ఆటగాళ్లు ఐపీఎల్లో ఆడినా ఫలితం మాత్రం భిన్నంగా వచ్చింది. ప్రపంచకప్కు ముందు ఐపీఎల్లో ఆడిన అనుభవం భారత్కు బాగా ఉపయోగపడుతుందని అందరూ భావించారు. |