ఇంగ్లాండ్లో జరిగిన ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్ను కైవసం చేసుకున్న పాకిస్థాన్ జట్టుకు నేతృత్వం వహించిన యూనిస్ ఖాన్ ట్వంటీ- 20 క్రికెట్కు గుడ్బై చెప్పాడు. ప్రపంచకప్ గెలుచుకున్న ఆనందంలో సంబరాలు జరుపుకుంటున్న పాకిస్థాన్ క్రికెట్ వర్గాలకు యూనిస్ ఈ ఆశ్చర్యకరమైన వార్తను వినిపించాడు.
ట్వంటీ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్న సందర్భంగా యూనిస్ ఖాన్ మాట్లాడుతూ.. నా వయస్సు ఇప్పుడు 34. ఈ తరహా క్రికెట్కు సరిపడే వయస్సు ఇది కాదని, అందువలనే ట్వంటీ- 20 క్రికెట్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు యూనిస్ ఖాన్ తెలిపాడు. తాజా ప్రపంచకప్లో పాక్ జట్టులో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు యూనిస్ ఖాన్ కావడం గమనార్హం.
టెస్ట్, వన్డే క్రికెట్పై దృష్టిసారించేందుకు వీలుగా ట్వంటీ- 20 క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నాను. ప్రపంచకప్కు ముందు కూడా ట్వంటీ- 20 క్రికెట్కు దూరమయ్యే ఆలోచన ఉన్నట్లు యూనిస్ పేర్కొన్నాడు. ప్రస్తుతం దీనిని నిజం చేశాడు. పాకిస్థాన్లో చాలా మంది యువ ఆటగాళ్లు ఉన్నారు.
పేస్బౌలర్ మొహమ్మద్ అమర్, ఆల్రౌండర్ ఫవాద్ ఆలం వంటి ఆటగాళ్లు జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నారు. ఇటువంటి ఆటగాళ్లు దేశ క్రికెట్ను ముందుకు నడిపించగలరు. ఈ తరహా క్రికెట్లో రాణించగలిగిన అనేక మంది ఆటగాళ్లు జట్టులో చోటుకోసం ఎదురుచూస్తున్నారని యూనిస్ ఖాన్ పేర్కొన్నాడు. తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో పాకిస్థాన్ జట్టుకు ప్రపంచకప్ను సాధించిపెట్టడం గర్వించదగిన అంశమన్నాడు. ఎప్పుడూ ప్రపంచకప్ గురించి కలలు కంటుండేవాడినని చెప్పాడు. |