పాకిస్థాన్లో క్రికెట్ ఆడేందుకు అంతర్జాతీయ క్రికెట్ సమాజం వెనకడుగు వేస్తున్న నేపథ్యంలో.. ఈ దేశ క్రికెట్ కెప్టెన్ యూనిస్ ఖాన్ మాట్లాడుతూ.. తమ దేశంలో ఆడేందుకు ముందుకురావాలని క్రికెట్ ఆడుతున్న దేశాలకు విజ్ఞప్తి చేశాడు. తీవ్రవాద భయంతో గత కొన్ని నెలలుగా పాకిస్థాన్లో క్రికెట్ ఆడేందుకు ప్రపంచదేశాలు విముఖత వ్యక్తం చేస్తున్నాయి.
తాజాగా ఇంగ్లాండ్లో జరిగిన ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్ను పాకిస్థాన్ జట్టు కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా ఆ జట్టు కెప్టెన్ యూనిస్ ఖాన్ మాట్లాడుతూ.. తమ దేశంలో క్రికెట్ ఆడేందుకు రావాలని ప్రపంచదేశాలకు విజ్ఞప్తి చేశాడు. లాహోర్లో మూడు నెలల క్రితం శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.
అంతకుముందు నుంచే పాకిస్థాన్లో ఆడేందుకు వివిధ దేశాలు వెనుకడుగు వేశాయి. ఈ నేపథ్యంలో ఆ దేశంలో అడుగుపెట్టిన శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రవాదులు దాడి చేశారు. అనంతరం పాకిస్థాన్లో క్రికెట్ ఆడేందుకు అన్ని క్రికెట్ దేశాలు ససేమిరా అన్నాయి. అంతేకాకుండా రెండేళ్ల తరువాత జరగాల్సిన ప్రపంచకప్ మ్యాచ్లను కూడా ఐసీసీ పాకిస్థాన్ నుంచి ఉపసంహరించింది.
తీవ్ర ప్రతికూల పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్థాన్ క్రికెట్కు తాజా ప్రపంచకప్ విజయం ఊరటనిచ్చేదే. ప్రస్తుత పరిస్థితుల్లో తమకు ఇటువంటి ఓ విజయం, ముఖ్యంగా ప్రపంచకప్ అవసరమని అందరికీ తెలుసు. దేశానికి ఇదొక కానుకని యూనిస్ ఖాన్ ఆదివారం లార్డ్స్లో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంకపై విజయం సాధించిన అనంతరం యూనిస్ వ్యాఖ్యానించాడు. |