వచ్చే ప్రపంచకప్ మ్యాచ్లకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇచ్చేందుకు సహఆతిథ్య దేశాలు విముఖత వ్యక్తం చేస్తున్నాయి. శ్రీలంక క్రికెట్ కమిటీ ఛైర్మన్ సోమచంద్ర డిసిల్వా మాట్లాడుతూ.. భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్లు 2011 ప్రపంచకప్ మ్యాచ్లకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాలని కోరుకోవడం లేదన్నారు.
జాంగ్ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డిసిల్వా మాట్లాడుతూ.. ప్రపంచకప్ నిర్వహణ దేశాల సంయుక్త కమిటీ సమావేశంలో ఈ విషయాన్ని పాకిస్థాన్ బోర్డు ఛైర్మన్ ఇజాజ్ బట్కు తేల్చిచెప్పినట్లు వెల్లడించారు. పాకిస్థాన్ వాటా మ్యాచ్లను తటస్థ వేదికలపై నిర్వహించుకునే వీలు కల్పించేందుకు కూడా సహ ఆతిథ్య దేశాలు విముఖత వ్యక్తం చేశాయన్నారు.
ఆతిథ్య హక్కులు కలిగివున్న దేశాలు మాత్రమే ప్రపంచకప్ మ్యాచ్లను నిర్వహించే హక్కు కలిగివుంటాయని, ఈ మ్యాచ్లను మరోచోట నిర్వహించేందుకు వీలు కల్పించే ప్రసక్తే లేదన్నారు. మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వకపోయినప్పటికీ, పాకిస్థాన్కు 1.1 మిలియన్ డాలర్ల ఆతిథ్య హక్కుల ఫీజులు చెల్లించేందుకు అంగీకరించామన్నారు.
పాకిస్థాన్ వాటా మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చే దేశాలు ఫీజులు వదులుకునేందుకు సముఖత వ్యక్తం చేశాయి. ఇటీవల సమావేశంలో పాకిస్థాన్ బోర్డు తమ దేశంలోనే మ్యాచ్ల నిర్వహణకు అనుమతించాలని కోరింది. అనంతరం తటస్థ వేదికలపై మ్యాచ్ల నిర్వహణను ప్రతిపాదించింది. అయితే ఈ రెండు ప్రతిపాదనలను ప్రపంచకప్ సహఆతిథ్య దేశాలు తిరస్కరించాయని డిసిల్వా చెప్పారు. ప్రపంచకప్ మ్యాచ్లపై నెలకొన్న వివాదాన్ని ఐసీసీ వార్షిక సమావేశంలో పరిష్కరించాల్సి ఉందన్నారు. |