బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు జాతీయ జట్టు కెప్టెన్ మొహమ్మద్ అష్రాఫుల్పై వేటు వేసింది. ఇంగ్లాండ్లో జరిగిన ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్ ప్రారంభ దశ నుంచే బంగ్లాదేశ్ జట్టు ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. దీనిపై స్వదేశంలో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కెప్టెన్పై వేటు వేసింది.
పేలవమైన బ్యాటింగ్ ప్రదర్శన కారణంగా అష్రాఫుల్ను కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పించినట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు తెలియజేశారు. ప్రపంచకప్ ప్రారంభ రౌండు నుంచే బంగ్లాదేశ్ ఇంటిముఖం పట్టడంపై అష్రాఫుల్ అభిమానుల ప్రధానలక్ష్యంగా మారాడు. కెప్టెన్సీకి రాజీనామా చేయాలని అభిమానులు కూడా డిమాండ్ చేశారు.
దీంతో జట్టు పేలవ ప్రదర్శనపై అష్రాఫుల్ బహిరంగ క్షమాపణ చెప్పాడు. అయితే జట్టు కెప్టెన్సీ నుంచి మాత్రం తప్పుకోనని స్పష్టం చేశాడు. తాజాగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అష్రాఫుల్ను కెప్టెన్సీ నుంచి తొలగించింది.
వైస్కెప్టెన్, ఫాస్ట్ బౌలర్ ముష్రాఫే మొర్తజాను కొత్త కెప్టెన్గా ప్రకటించనున్నట్లు బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మంగళవారం వెలువడనుంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు రెండేళ్ల క్రితం అష్రాఫుల్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. అతని సారథ్యంలో బంగ్లాదేశ్ జట్టు అంతర్జాతీయ క్రికెట్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. |