ఇటీవల కాలంలో రాష్ట్రంలో మహిళలు లైంగిక వేధింపులకు గురికావడం వంటి సంఘటనలు ఎక్కువవుతున్న విషయం తెలిసిందే. ఈ వేధింపులు క్రికెట్ రంగాన్ని కూడా వీడలేదు. కొంత మంది మహిళా క్రికెటర్లపై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కార్యదర్శి చాముండేశ్వరీనాథ్ అనుచితంగా ప్రవర్తిస్తునట్లు తాజాగా ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది.
దీనిపై రంజీ జట్టు సభ్యులు సవితా కుమారీ, దుర్గాభవానీ, కళ్యాణీలు విలేకరులతో మాట్లాడుతూ, ఆంద్ర క్రికెట్ను, క్రీడాకారిణిలను కాపాడాల్సిన బాధ్యత ఉందని ప్రభుత్వాన్ని కోరారు. చాముండేశ్వరీనాథ్ పెట్టే వేధింపులకు తాలలేక.. అలాగని బయటకు చెప్పుకోలేక ఎంతో మంది క్రీడాకారిణిలు బాధను దిగమింగుకుంటున్నారని తెలిపారు.
గతంలో తాను ఏసీఏకు ఇచ్చిన ఫిర్యాదు ఉపసంహరించుకునేలా చేయడానికి ఎన్నో బెదిరింపు ప్రయత్నాలు జరిగాయని, ఆఖరుకు తనను కిడ్నాప్ చేయడానికి కూడా ప్రయత్నించారని సవితా ఆరోపించింది. అలాగే మహిళా క్రికెట్ కోఆర్డినేటర్ శిరీషకు క్రికెట్ గురించే తెలియదని.. అమ్మాయిలను ట్రాప్ చేయడం వంటివి చేస్తోందని సవిత వెల్లడించింది.
కాగా, ఈ విషయంపై క్రీడా మంత్రి డీజీ కె వెంకట రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, ఏసీఏలో ప్రస్తుత పరిస్థితులపై తమకు ఆందోళనగా ఉందన్నారు. ఈ విషయంపై సత్వరమే విచారణ చేపట్టి తదుపరి చర్యకు తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.
చాముండేశ్వరీనాథ్పై మహిళా క్రికెటర్లచే హోం మంత్రి పి సబితా రెడ్డికి వ్రాత పూర్వకమైన ఫిర్యాదు అందిన తర్వాత వెంకట్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఈ విషయంపై వెంటనే విచారణ చేపట్టాల్సిందిగా ప్రభుత్వం నుండి తమకు ఆదేశాలందాయని ఓ సీనియర్ పోలీసు అధికారి ఎం రతన్ తెలిపారు. |